కోర్టుకు హాజరవుతా, కేసీఆర్ని నన్ను కూర్చోబెట్టొచ్చుగా: బాబు, మిర్యాలగూడ ప్రణయ్ హత్యపై స్పందన
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. బాబ్లీ ప్రాజెక్టు ఎపిసోడ్, వారెంట్ల జారీ అంశంపై చర్చించారు. గతంలో ధర్మాబాద్ కోర్టు నుంచి నోటీసులు కానీ, వారెంట్లు కానీ వచ్చాయా అనే అంశంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు జారీ కాలేదని, వారెంట్లు రాలేదని అధికారులు తెలిపారు.
మల్లాది విష్ణుకు సంకేతాలు, అలిగివెళ్లిన వంగవీటి రాధా: అధిష్టానం హెచ్చరిక
న్యాయవ్యవస్థను గౌరవిస్తూ ధర్మాబాద్ కోర్టుకు వెళ్దామని చంద్రబాబు అన్నారు. ప్రత్యామ్నాయాలు పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని పలువురు నేతలు అధినేతకు సూచించారు. రీకాల్ పిటిషన్ వేస్తే కోర్టుకు వెళ్లవలసిన అవసరం ఉండకపోవచ్చునని చెప్పారు. రేపు మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
రాయలసీమపై ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నారు
రాయలసీమపై కొందరు నేతలు అకస్మాత్తుగా ప్రేమ చూపిస్తున్నారని చంద్రబాబు అన్నారు. బీజేపీ నేతలకు అంత ప్రేమ ఉంటే ఉక్కు పరిశ్రమ తేవాలన్నారు. ఏపీలో పరిశ్రమలకు కేంద్రం రాయితీలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఏపీకి మెట్రో ఇస్తామని ఇప్పుడు వయోబులిటీ లేదని చెబుతున్నారని విమర్శించారు. రాజధానికి అంతర్జాతీయ విమానాలు నడపాలంటే పట్టించుకోరని కేంద్రంపై మండిపడ్డారు.
మా ఇద్దర్నీ కూర్చోబెట్టొచ్చుగా
రెండు సోదర రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య గొడవ పెట్టాలని బీజేపీ చూస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం 29సార్లు ఢిల్లీకి వెళ్లానని చంద్రబాబు చెప్పారు. రాజకీయ సుస్థిరత కోసం నియోజకవర్గాలు పెంచాలని కోరితే పట్టించుకోలేదన్నారు. నిధులు అడిగితే తమ పైనే ఎదురుదాడి చేస్తున్నారని, దాంతో పాటు బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ప్రణయ్ హత్యపై చంద్రబాబు
ఇదిలా ఉండగా, అంతకుముందు అసెంబ్లీలో తెలంగాణలోని నల్గొండ జిల్లాలో జరిగిన ప్రణయ్ హత్యపై చంద్రబాబు స్పందించారు. కులాలకు అతీతంగా పెళ్లిళ్లు జరపాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని చెప్పారు. అహంభావంతో చంపించే పరిస్థితికి దిగజారడం బాధాకరమన్నారు. పెళ్లి కానుక తేవడంలో ముఖ్య ఉద్దేశ్యం కులాంతర వివాహాలను ప్రోత్సహించడమే అన్నారు. పెళ్లి కానుకతో కులాంతర వివాహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామన్నారు. మిర్యాలగూడలో కులాంతర వివాహం నేపథ్యంలో తండ్రి అబ్బాయిని చంపించాడటంటే ఎంత మూఢనమ్మకం, ఎంత అహంకారం ఉందో అర్థమవుతోందన్నారు. అబ్బాయి మంచివాడు అయినప్పుడు, అమ్మాయికి నచ్చినప్పుడు, పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారని భావించినప్పుడు తల్లిదండ్రులు వారిని ఆశీర్వదించాలన్నారు. లేదంటే వాళ్లని వదిలేయాలన్నారు. అంతేకానీ దారుణంగా చంపించి సాధించేదేమీ లేదన్నారు.
ఆపరేషన్ ఇడ్లి, వడ కూడా లేదు
కాగా, చంద్రబాబుకు నోటీసులపై తెలుగుదేశం పార్టీ నేతలకు ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారా అని బీజేపీ తెలంగాణ నేత కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మేం కూడా రైల్వే నోటీసులు అందుకొని, కోర్టుకు హాజరవుతున్నామని, మాపై కూడా కేంద్రం కుట్ర చేసిందా అని ప్రశ్నించారు. శివాజీ చెబుతున్నట్లుగా ఆపరేషన్ గరుడ కాదు కదా.. ఆపరేషన్ ఇడ్లి, వడ కూడా లేదన్నారు.