చంద్రగిరిలో రీపోలింగ్ ఫై చంద్రబాబు అసంతృప్తి .. ఈసీది పక్షపాత ధోరణి అన్న బాబు
Recommended Video
ఏపీలో ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ రోజున కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహణ పైన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి . ఈ ఫిర్యాదులు..ఆరోపణల ఆధారంగా జిల్లా కలెక్టర్ల నుండి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నివేదిక కోరారు. దీనికి అనుగుణంగా వచ్చిన నివేదికలను పరిగణ లోకి తీసుకొని ఈనెల 6వ తేదీన అయిదు కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించారు.
ఏపీలో మరోసారి..అయిదు చోట్ల : చంద్రగిరి నియోజకవర్గంలో : 19న రీపోలింగ్..ఎందుకంటే...!
ఇక, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజక వర్గంలోని పలు పోలింగ్ బూత్లలో కూడా నిర్వహించిన పోలింగ్ పై అభ్యంతరాలు ఉన్నాయని రీ పోలింగ్ నిర్వహించాలని కొద్ది రోజులుగా టీడీపీ..వైసీపీ పరస్పరం ఒకరి మీద మరొకరు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసారు. దీని పైన విచారణ చేయించిన సీఈవో అయిదు కేంద్రాల్లో రీ పోలింగ్కు సిఫార్సు చేసారు. దీనికి అనుగుణంగా ఈ నెల19వ తేదీన చంద్రగిరి నియోజకవర్గంలోని అయిదు పోలింగ్ బూత్లలో రీపోలింగ్ జరగనుంది.
చంద్రగిరిలో రీపోలింగ్పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం టీడీపీ అడిగిన బూత్లను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. అంతే కాదు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అడిగిన 7 బూత్లలో 5 బూత్లకు రీపోలింగ్ నిర్వహించడం సరి కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు . టీడీపీ అడిగిన స్థానాల్లోనూ రీపోలింగ్ జరపాలని ఆయన డిమాండ్ చేశారు . దీని ద్వారా ఈసీ పక్షపాత ధోరణి మరోసారి రుజువైందని చంద్రబాబు అన్నారు. రీపోలింగ్పై గురువారం ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు .