పవన్కు ఏం సమాధానం చెప్తారు?, రాజకీయాల్లో బాబు దిగజారిపోయారు..: వైసీపీ
విజయవాడ: అవిశ్వాసం విషయంలో చంద్రబాబు నాయుడు వైఖరిని తప్పు పట్టారు వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారధి. పార్లమెంటు నిబంధనల గురించి తెలిసినవారికి ఎవరికైనా చంద్రబాబు చెబుతున్న అసత్యాలు, చేస్తున్న విన్యాసాల గురించి అర్థమవుతాయని అన్నారు.
విజయవాడలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో పార్థసారథి సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లోని పార్టీలు వారివారి కారణాల వల్ల అవిశ్వాసానికి మద్దతునిస్తుంటే.. అదేదో తన ఘనతలా చంద్రబాబు ప్రచారం చేయించుకోవడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
రాష్ట్రంలో స్వచ్చమైన పాలనే ఉంటే.. వామపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు పోరాడుతాయని పార్థసారథి ప్రశ్నించారు. కేంద్రంపై వ్యతిరేకత కారణంగానే వామపక్షాలు అవిశ్వాసానికి మద్దతునిచ్చాయి అని తెలిపారు. నాలుగేళ్లు కలిసి వున్న మీ భాగస్వామి పవన్ కల్యాణ్ మీ అవినీతిని బయటపెట్టారు.
నాలుగేళ్లు కలిసి వున్న మీ భాగస్వామి పవన్ కల్యాణ్ మీ అవినీతిని బయటపెట్టారు. పవన్కు మీరు ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి చేసిన అన్యాయంపై పశ్చాత్తాపం వుంటే...ఇప్పటివరకూ ఎందుకు అఖిలపక్ష సమావేశం పెట్టలేదని నిలదీశారు.
ప్రజల దృష్టిని మరల్చడానికి వైఎస్ జగన్పై వున్న కేసులున్నాయని, అవినీతిపరుడని ప్రచారం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే.. న్యాయవ్యవస్థపై ఆయనకు నమ్మకం, గౌరవం లేన్నట్లుగా ఉందన్నారు. కేంద్రంతో అనుకూలంగానో... వ్యతిరేకంగానో ఉన్నంత మాత్రానా కేసులు కొట్టేస్తారని ఎలా అంటారని ప్రశ్నించారు.
దేశ రాజకీయాల్లో తానే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబుకు న్యాయవ్యవస్థపై ఏమాత్రం అవగాహన ఉందో అర్థం అవుతుందన్నారు. ఇసుక, మట్టి, పోలవరం.. ఇలా ప్రతీ దాంట్లో టీడీపీ చేసిన అవినీతిని ఎండగడుతామని అన్నారు.