బాబు గారు పొరపడ్డారా?.. సూర్యోదయం విషయంలో... ఆ ఎపిని... ఈ ఎపి అనుకున్నారా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన "సూర్యారాధన" కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంలోని కొన్నివ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సిఎం చంద్రబాబు తన ప్రసంగంలో సూర్యుడు ఎపి నుంచి ఉదయిస్తాడని అనడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. చంద్రబాబు తన కొత్త కొత్త సూత్రీకరణలతో భూగోళ - ఖగోళ శాస్ర్తాలనే మార్చేస్తున్నాడని సెటైర్లు వేస్తున్నారు.
Recommended Video
ఇంతకీ సూర్యారాధన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమన్నారు? ఎందుకు అలా అన్నారు?...మర్చిపోయారా?...కన్ఫ్యూజ్ అయ్యారా...తెలియక అన్నారా? లేక...ఎవరైనా ఇచ్చిన సమాచారం ఆధారం చేసుకొని అలా అనుకున్నారా?ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేముందు అసలు సిఎం చంద్రబాబు...సూర్యారాధన కార్యక్రమంలో ఏమన్నారో...మళ్లీ ఒక్కసారి చూద్దాం...
"సూర్యారాధన" సందర్భంగా...చంద్రబాబు ఏమన్నారంటే...
తూర్పు తీర ప్రాంతంగా ఏపీ నుంచే సూర్యుడు ఉదయిస్తున్నందున, దీనికి "సన్ రైజ్ స్టేట్" అనే నినాదమిస్తున్నామని పేర్కొన్నారు...ఇప్పుడు ఈ వ్యాఖ్యలే చర్చకు దారితీసాయి. సూర్యుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉదయిస్తున్నాడని చంద్రబాబు చెప్పడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు... ఆంధ్రప్రదేశ్ నుంచి సూర్యుడు ఉదయించడమేమిటని ప్రశ్నిస్తున్నారు...చంద్రబాబు గారికి వయసు పెరిగి మతిమరుపు వచ్చిందా...లేక అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారా...అనే టైపులో వారు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు...
భారతదేశంలో...సూర్యోదయం ఎక్కడంటే?...
భారతదేశంలో తొలి సూర్యోదయం ఎక్కడో ఇండియా మ్యాప్ తీసుకుని చూస్తే చాలు తెలసిపోతుందని నెటిజన్లు సలహా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశ తూర్పు తీరంలో ఉన్నా దీనికంటే ముందు వరుసలో మరికొన్నిరాష్ట్రాలు ఉన్నాయని, ఇక భారతదేశానికి అత్యంత తూర్పున ఉన్న ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ అని, ఆ రాష్ట్రంలోని పూర్వాంచల్ పర్వతాల్లోని దిల్ఫా కనుమ వద్ద ‘డాంగ్' అని చిన్న గ్రామం ఉందట. భారతదేశంలో సూర్యుడు మొట్టమొదట కనిపించేది అక్కడేనంటున్నారు. జాగ్రఫీ లెక్కల ప్రకారం...భారత దేశం 68°7' 97°25' రేఖాంశాల మధ్య ఉంటుంది. 97°25' రేఖాంశంపై అరుణాచల్ ప్రదేశ్ లోని డాంగ్ ఉంది. అక్కడే మన తొలి సూర్యోదయం జరుగుతుది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే 76°46' నుంచి 84°46' రేఖాంశాల మధ్య ఉంది ఈ రాష్ర్టం. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం మండలంలో బాహుదా నది బంగాళాఖాతంలో కలుస్తున్న చోట ఆంధ్రప్రదేశ్ లో తొలి సూర్య కిరణాలు పడతాయి. బాహుదా నది దాటి వెళ్తే ఒడిశాలో ప్రవేశిస్తాం. ఒడిశా నుంచి మొదలుకుని ఎగువన ఉన్న ఝార్ఖండ్ - పశ్చిమబెంగాల్ - బిహార్ - అసోం - మేఘాలయ - త్రిపుర - సిక్కిం - నాగాలాండ్ - మణిపూర్ - మిజోరాం - అరుణాచల్ ప్రదేశ్ తో కలిపి మొత్తం 12 రాష్ట్రాల్లో మన కంటే ముందుగా సూర్యోదయం అవుతుందని సోదాహరణంగా వివరిస్తున్నారు.
పోనీ మరోరకంగా చూస్తే...అలా కూడా కాదు...
భారతదేశం లో టైమును నిర్ణయించే ప్రామాణిక రేఖాంశం 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం కాకినాడ మీదుగా వెళ్తుంది కాబట్టి మనదే తొలి సూర్యోదయం అని చంద్రబాబు ఆ రకమైన విశ్లేషణతో అన్నారని అనుకుంటే...అప్పుడు కూడా మనతో పాటు ఈ ప్రామాణిక రేఖాంశాన్ని పంచుకుంటున్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ - మధ్యప్రదేశ్ లోని రేవా - ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ - ఒడిశ లోని కోరాపుట్ - పాండిచ్చేరిలోని యానాం మీదుగా ఈ రేఖాంశం వెళ్తుంది. అప్పుడు కూడా మనం ఒక్కరమే కాదు...
గూగుల్ వికీపీడియాలో...ఆ ఎపిని...ఈ ఎపి అని...
ఇంతకీ గూగుల్ సెర్చ్ కొట్టి వికీపిడియాలో చూస్తే...అందులో ఏమని ఉందంటే...భారతదేశంలో సూర్యుడు ఉదయించేది...అరుణాచల్ ప్రదేశ్ లోని లోహిత్ అనే జిల్లాలో డోంగ్ అనే చిన్నగ్రామంలోనట. ఇది భారతదేశానికి తూర్పు దిశ చివర ఉండే గ్రామమట. ఇంకా సూర్యోదయం సంబంధించి లోతుగా వెళితే భౌగోళికంగా కాహో అనే గ్రామం భారతదేశం అంచులో ఉంటుందని వికిపీడియాలో పేర్కొనడం జరిగింది. అందుకే అరుణాచలప్రదేశ్ లో మన కంటే రెండు గంటల ముందే సూర్యోదయం అవుతుందట...అయితే ఒకవేళ చంద్రబాబు అరుణాచల్ ప్రదేశ్ ని ఆంధ్ర ప్రదేశ్ గా పొరపాటుపడ్డారా అని తర్కిస్తున్నారు...ఆ ఎపిని...ఈ ఏపి అని కన్ఫ్యూజ్ అయ్యారేమో అని ముక్తాయిస్తున్నారు.
ఇప్పుడు...ఈ సెటైర్లన్నీదేనికంటే...
కాబట్టి సూర్యుడు తూర్పున ఉదయించును అనే వ్యాఖ్య ఎంత నిజమో భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ నుంచే సూర్యుడు ఉదయిస్తున్నాడనేది అంత అబద్దమంటున్నారు నెటిజన్లు. తెలియకపోతే తెలియనట్లు ఉండాలి గానీ ఇలా తప్పుడు సమాచారాన్ని అంతమంది విద్యార్థులు, అధికారులు ఉన్న చోట వాళ్ల ముందు బహిరంగంగా మాట్లాడటం ఆయనకే అవమానకరమని అంటున్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమంటే ఇలా కాదంటున్నారు...సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడో తెలుసుకోవాలంటే...ఏదో ఒక జికె బుక్ చూసినా లేక స్కూలు పిల్లల జాగ్రఫీ పుస్తకాల్లో వెతికినా...పోనీ ఇదంతా ఎందుకనుకుంటే గూగుల్ సెర్చ్ కొట్టినా అసలు విషయం తెలిసిపోతుందంటున్నారు. చిన్నపిల్లలకు కూడా తెలిసిన విషయాన్ని చంద్రబాబు ఖచ్చితంగా ఏ విషయం తెలుసుకోకుండా అలా అందరిని తప్పు దోవ పట్టించేలా మాట్లాడటం కరెక్ట్ కాదని విమర్శలు కురిపిస్తున్నారు.