చంద్రబాబుకు ట్రాఫిక్ తిప్పలు, పవన్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కూడా ట్రాఫిక్ చిక్కులు తప్పలేదు. సామాన్యులకు ట్రాఫిక్ ఇక్కట్లు సర్వసాధారణం. వీఐపీలకు.. ముఖ్యంగా సీఎంలు, మంత్రులు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వెళ్తారు.
కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంగళవారం ట్రాఫిక్ చిక్కులు తప్పలేదు. బుధవారం జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన శ్రీకాకుళం వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం గన్నవరం విమానాశ్రయం బయలుదేరారు.
ఆ సమయంలో ట్రాఫిక్లో చిక్కుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి వెళ్తుండగా స్థానిక బెంజి సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.
పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 'నేటి మన స్వాతంత్ర్య సంబరం ఎందరో మహనీయులు, వీరుల త్యాగాలఫలం. సమరయోధుల పోరాట పటిమతో మనకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లభించాయి. జీవితాలను తృణప్రాయంగా భావించి తెల్లవారిపై పోరుసల్పిన ఎందరో విప్లవ వీరుల ప్రాణ త్యాగాలు మన స్వాతంత్ర్య పోరాట చరిత్రలోని ప్రతి అధ్యాయంలో కనిపిస్తాయి. మహనీయుల త్యాగాలకు సార్థకత కలిగించాల్సిన బాధ్యత భారతీయులపై ఉంది" అని పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధులు కొద్దిమంది క్షేమం కోసం కాకుండా సువిశాల భారతాన్ని మదిలో ఉంచుకొని కోట్లాదిమంది ప్రజల ప్రయోజనం కోసం పని చేయాలన్నారు. అందుకు భిన్నంగా వర్తమానం ఉందని చెప్పారు. డెబ్బై ఏళ్లు పైబడిన మన స్వతంత్ర భారతంలో అభివృద్ధి ఫలాలు అతి కొద్దిమందికే అందుతున్నాయని, ఆర్థికంగా బలమైనవారు మరింత బలపడుతుంటే పేదవారు మరింత పేదలుగా మారుతున్నారని, ఇది అభివృద్ధి అనలేమన్నారు. కుల, మత, ప్రాంత వివక్షలతో కునారిల్లే పరిస్థితులు సమాజానికి శ్రేయస్కరం కాదని చెప్పారు.
మహాత్మా గాంధీ, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ప్రకాశంపంతులు, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయులు అందించిన స్ఫూర్తిని మనమంతా నరనరాన నింపుకోవాలని, పాలకుల కుటుంబాలు మాత్రమే వెలుగొందితే ప్రజాస్వామ్యం అనిపించుకోదన్నారు. మా కుటుంబం, మావాళ్లు అనే కుంచిత ధోరణితో పాలన చేసేవారి నుంచి మనం విముక్తం కావాలన్నారు. అలాంటప్పుడే కిందిస్థాయి వరకు సంక్షేమ ఫలాలు అందించగలమన్నారు. అప్పుడు ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు. ఇది మనందరి ఆకాంక్ష కావాలన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.