చంద్రబాబు దీక్ష, సామాన్యులకు ట్రాఫిక్ ఇక్కట్లు: జగన్పై తీవ్ర విమర్శలు
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష కారణంగా హనుమాన్ జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీక్ష నేపథ్యంలో జాతీయ రహదారిపై కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.
ఈ దీక్ష కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచాయి. హనుమాన్ జంక్షన్ కూడలి నుంచి ఏలూరు వైపు సుమారు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా, దీక్ష ప్రాంగణంలో పలువురు టీడీపీ నేతలు మాట్లాడారు.
ఫిలిం ఛాంబర్లో పవన్ కళ్యాణ్, ప్రముఖులందరూ రావాలని ఆదేశం
మన సమస్యను జాతీయస్థాయిలోకి తీసుకెళ్లాం
ఏపీ ఇబ్బందుల్లో ఉన్నప్పటికి చంద్రబాబు కష్టపడి ఎన్నో పరిశ్రమలను తీసుకు వచ్చారని గల్లా జయదేవ్ అన్నారు. దీనిని బట్టే చంద్రబాబుకు ఏపీ అభివృద్ధిపై ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందన్నారు. ఏపీ అన్నింటా ముందంజలో ఉందని చెప్పారు. ప్రధాని మోడీ మనకు ఎక్కడెక్కడ అయితే హామీలు ఇచ్చారో అక్కడితో పాటు అంతటా నిరసన తెలుపుతున్నామన్నారు. ఓ ప్రధాని మాట ఇచ్చి తప్పితే ఎలా అన్నారు. ఇప్పుడు ఈ సమస్య దేశవ్యాప్తంగా మారుమోగుతోందన్నారు.
మోడీని తిడుతూ, శివప్రసాద్ ఆరు వేషాలు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పిస్తూ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కుప్పంలో నిరసన తెలిపారు. ఆయన ఒక్కరోజే ఆరుకు పైగా వేషాలు వేశారు. పాటల రూపంలో మోడీపై తిట్ల వర్షం కురిపించారు.
175 నియోజకవర్గాల్లో దీక్షలు, ర్యాలీలు
చంద్రబాబు దీక్షకు సంఘీభావంగా 175 నియోజకవర్గాలలో ప్రజలు దీక్షలు, ర్యాలీలు చేపట్టారు. పలువురు మంత్రులు తమ సొంత జిల్లాల్లో దీక్షలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన దీక్షకు సంఘీభావంగా శ్రీకాకుళం జిల్లాలో ధర్మ పోరాట దీక్షలు జరిగాయి. ఇక్కడ రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
మోడీ-జగన్ మధ్య విజయసాయి దూతగా
ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏపీకి ఇవ్వడం లేదని మండిపడ్డారు. నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. బీజేపీకి రాష్ట్రంలో ఒక్కసీటు కూడా రాదన్నారు. కనీసం అయిదు శాతం ఓట్లు కూడా పడవన్నారు. వైసీపీతో బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. మోడీ, జగన్ మధ్య విజయ సాయి రెడ్డి దూతగా వ్యవహరిస్తున్నారన్నారు. జగన్ కేసుల మాఫీ కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారని ఆరోపించారు.