అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ పై మండిపడిన చంద్రబాబు .. జైల్లో ఉంచాలనే సైకో మనస్తత్వంతో ఇలా
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, తాజా ఎమ్మెల్యే ఈఎస్ఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడును గుంటూరులోని జిజిహెచ్ నుండి డిశ్చార్జ్ చేశారు. ఆయన డిశ్చార్జ్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అచ్చెన్నాయుడు అనారోగ్యంతో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఒత్తిడి మేరకే కావాలని ఆయనను డిశ్చార్జ్ చేశారని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు.
ESI Scam : అచ్చెన్నాయుడు ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది.. ఏసీబీ ప్రశ్నల వర్షం .. కీలక సమాచారం రాబట్టారా ?
ప్రభుత్వ ఒత్తిడితో అచ్చెన్నాయుడుని డిశ్చార్జ్ చేయడాన్ని ఖండిస్తున్నాం
ప్రభుత్వ ఒత్తిడితో అచ్చెన్నాయుడుని డిశ్చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు .డిశ్చార్జ్ చేయడంలో కనీస నిబంధనలు కూడా పాటించ లేదని, ఇది గర్హనీయమని పేర్కొన్నారు చంద్రబాబు. సాయంత్రం ఐదు గంటల తర్వాత డిశ్చార్జ్ చేసి , డిశ్చార్జ్ చేసిన సమయాన్ని నాలుగు గంటల ఇరవై నిమిషాలుగా తప్పుగా వేశారని మండిపడ్డారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని అభిప్రాయపడ్డారు చంద్రబాబు. కావాలనే అచ్చెన్నాయుడు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అచ్చెన్నాయుడు ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది
కమిటీ పేరుతో ఒత్తిడి తెచ్చి తప్పుడు నివేదిక ఇప్పించడం శోచనీయమని చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అచ్చెన్నాయుడు కి రెండోసారి ఆపరేషన్ జరగడానికి ప్రభుత్వమే కారణమైందని పేర్కొన్న చంద్రబాబు అచ్చెన్నాయుడు ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ఆయన అరెస్టు విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులు అన్నీ ఇన్నీ కావని అసహనం వ్యక్తం చేశారు టిడిపి అధినేత. ఇంకా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకుండా అచ్చెన్నాయుడుని వేధింపులకు గురి చేయడం దారుణమైన చర్య అని అభిప్రాయపడ్డారు చంద్రబాబు.
చికిత్స పొందాల్సిన వ్యక్తిని వీల్ చైర్ లో ,అంబులెన్స్ లో జైలుకు తీసుకెళ్లటం శాడిజం
చికిత్స పొందాల్సిన వ్యక్తిని వీల్ చైర్ లో కూర్చో బెట్టి, అంబులెన్స్ లో జైలుకు తీసుకెళ్లడం వెనక వైసీపీ ప్రభుత్వ రాక్షసత్వం కనిపిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. అచ్చెన్నను ఒక్కరోజైనా జైల్లో ఉంచాలనే సైకో మనస్తత్వమే కనిపిస్తోందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకోవడం తప్పు అని పేర్కొన్నారు చంద్రబాబు.
Recommended Video
అచ్చెన్నాయుడు వ్యవహారంలో ప్రభుత్వం తీరు అమానవీయం
ఇప్పటికే అచ్చెన్నాయుడు వ్యవహారంలో ప్రభుత్వం అడుగడుగునా అమానవీయంగా ప్రవర్తించినదని, ఆయనకు రెండోసారి సర్జరీ జరిగిన కక్ష తీర లేదు అన్నట్టుగా ఉన్నట్టుండి డాక్టర్స్ డే రోజున ఆయనను డిశ్చార్జ్ చేయించి మరో దుర్మార్గానికి పాల్పడింది వైసిపి ప్రభుత్వమని చంద్రబాబు మండిపడ్డారు.గుంటూరు జిజిహెచ్ నుండి డిశ్చార్జ్ చేసిన తర్వాత పోలీసులు అచ్చెన్నాయుడు ను విజయవాడలోని సబ్ జైలుకు తరలించారు. జైలు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.