3రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోవడంలో టీడీపీ పాత్ర: బాబు, జగన్-పవన్-కేసీఆర్లపై నిప్పులు
విశాఖపట్నం: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైసీపీ అధినేత వైయస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై గురువారం నిప్పులు చెరిగారు. చిట్టివలస జాట్ మిల్లు మైదానంలో జరిగిన ఆత్మీయ సదస్సులో, ఐ-హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఐటీ కారిడార్లోనూ చంద్రబాబుకు ఎదురుదెబ్బ, సుహాసినికి సీమాంధ్రులు షాకిచ్చారు
తాను కేసీఆర్ వ్యాఖ్యలకు భయపడే ప్రసక్తి లేదని చంద్రబాబు చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని తాను ఎప్పుడూ అడ్డుకోలేదని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు పోవాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తున్న కేసీఆర్ను వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు సమర్థిస్తున్నారని విమర్శించారు.
జగన్, పవన్ కళ్యాణ్లకు వచ్చిన ఇబ్బంది ఏమిటో
తెలంగాణకు ఇబ్బంది లేకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెబితే జగన్, పవన్ కళ్యాణ్లకు వచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. ఇలాంటి లాలూచీ రాజకీయాలు చేసేవారు చరిత్రహినులుగా మిగిలిపోతారని వారిని హెచ్చరించారు. అవినీతిలేని రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలకు తాను ఎప్పుడూ అడ్డుపడలేదని చెప్పారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఐటీ దాడులు
మన ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని కేంద్రంపై చంద్రబాబు మండిపడ్డారు. నేను ఎవరితోను లాలూచీ పడలేదని చెప్పారు. గొడవలు అక్కర్లేదనుకున్నానని, రాష్ట్రం కోసం కష్టపడాలనుకున్నానని చెప్పారు. ఇక్కడున్న రాజకీయా పార్టీలతో కేంద్రం లాలూచీ పడిందని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్, జగన్, కేసీఆర్లను మనపైకి ఎగదోస్తున్నారని చెప్పారు. బీజేపీని ఎదుర్కోవడానికి అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేశామన్నారు.
మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమిలో టీడీపీ పాత్ర, కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ కరెక్టా
ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వంటి మూడు రాష్ట్రాల్లో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిందంటే టీడీపీ వాళ్ల కృషి కూడా ఉందని చంద్రబాబు చెప్పారు. టీడీపీ పుట్టింది తెలంగాణలోనే అని, ఆయన కూడా మన పార్టీలో ఉన్నవారేనని కేసీఆర్ను ఉద్దేశించి చెప్పారు. ఆయన బర్త్ డే గిఫ్ట్ తిరిగి ఇస్తామని చెబుతున్నాడని, ఇది న్యాయమా అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, కేసీఆర్ నాడు హోదా కావాలన్నాడని, ఇప్పుడు వద్దని చెబుతున్నాడని, హోదాను వ్యతిరేకించిన అతనితో ఏపీ నేతలు కలవడం ఏమిటని ప్రశ్నించారు. సీబీఐ అవినీతిలో కూరుకుపోయిందని చెప్పారు. ఓ అవినీతిపరుడిని మోడీ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
విభేదాలు లేకుండా ముందుకు సాగాలి
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు పోవాలని చంద్రబాబు అన్నారు. నవ్యాంధ్ర ఇబ్బందుల నుంచి బయటపడేందుకు తాను రాత్రింబవళ్లు శ్రమిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పారు. ధనిక రాష్ట్రాల కంటే మిన్నగా తాము సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నంను సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని చంద్రబాబు చెప్పారు. ఏపీని నాలెడ్జ్ హబ్గా తయారు చేస్తామని, ఐ హబ్కు కూడా విశాఖలోనే నాంది పలికామని, ఐ హబ్ ద్వారా విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తామని చెప్పారు.