ధరలు తగ్గినా ప్రయోజనంలేదు, ఆపరేషన్ గరుడపై సాక్ష్యాలు: జగన్ను లాగి బాబు షాకింగ్
అమరావతి: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలకు భారంగా మారాయని చెప్పారు. ఇంధన ధరలు తగ్గించేందుకు నాలుగేళ్లుగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం వల్లే ధరల పెరుగుదల అని కేంద్రం మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందన్నారు.
Recommended Video
చంద్రబాబుకు 'నోటీసు'లలో వాస్తవమెంతా?: కాంగ్రెస్-టీడీపీ దోస్తీ.. మైండ్ గేమా?
2013 - 14లో ముడిచమురు ధర బ్యారెల్కు 105.52 డాలర్లు ఉండగా, 2015-16లో బ్యారెల్ ధర రూ.46 డాలర్లకు పడిపోయిందని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ధర రూ.72.23గా ఉందని చెప్పారు. 2014లో లీటర్ పెట్రోల్ ధర రూ.49.60గా ఉండేదని, ఇప్పుడు రూ.86371గా ఉందని చెప్పారు.
క్రూడాయిల్ ధర తగ్గినా ప్రయోజనం లేదు
క్రూడాయిల్ ధర తగ్గినా ప్రజలకు ప్రయోజనం లేకుండా పోయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర తగ్గినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు చమురు ధరలు పెరిగాయన్న వంకతో ఎడాపెడా ధరలు పెంచుతున్నారని ఆరోపించారు.
తగ్గింపు సాధ్యం కాదని చెప్పారు
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు సాధ్యం కాదని పెట్రోలియం శాఖ మంత్రి స్పష్టంగా చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్త నిరసనలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించాలని చంద్రబాబు చెప్పారు.
వైసీపీకి బాధ్యత లేదా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ రాజకీయ పార్టీయేనా అని ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వైసీపీకి కనిపించడం లేదా అని నిలదీశారు. వైసీపీకి బీజేపీని చూస్తే కేసులు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. దేశమంతా ఓదారి అయితే వైసీపీది మరో దారి అని చంద్రబాబు అన్నారు. పెట్రో ధరలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుంటే వైసీపీ మాత్రం మౌనంగా ఉందని చెప్పారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీకి బాధ్యత లేదా అన్నారు.
ఆపరేషన్ గరుడ గురించి అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావన
ఆపరేషన్ గరుడ గురించి ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రస్తావించారు. జగన్ను మీరు కాపాడటం లేదా అని బీజేపీ సభ్యులను ప్రశ్నించారు. జగన్ కేసులు ముందుకు ఎందుకు సాగడం లేదో చెప్పాలన్నారు. ఆ విషయం మీకు తెలియదా అని బీజేపీ శాసన సభా పక్షనేత విష్ణును నిలదీశారు. ముసుగు వీరుల ఆటలు ఏపీలో సాగవని, అన్ని సాక్ష్యాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.