కోర్టులు మొట్టికాయలు వేసినా, చెంపదెబ్బలు తిన్నా..: చంద్రబాబు చేతికి మరో అస్త్రం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సర్కారుపై విరుచుకుపడేందుకు టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు మరో అస్త్రం దొరికింది. పీపీఏల ఒప్పందాల్లో ఎలాంటి అవినీతి జరగలేదంటూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్రమంత్రి ఆర్కే సింగ్ లేఖ రాయడంపై చంద్రబాబు స్పందించారు.
సమీక్ష అవసరం లేదనడంతో..
టీడీపీ ప్రభుత్వం మూడు కంపెనీలకే 70శాతం కేటాయింపులు చేశారంటూ వైసీపీ చేస్తున్న వాదనల్లో వాస్తవం లేదని ఆ లేఖలో కేంద్రమంత్రి స్పష్టం చేయడంతో టీడీపీ నేతలు జగన్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షించాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి స్పష్టం చేయడంతో.. చంద్రబాబు జగన్ సర్కారును లక్ష్యంగా చేసుకుని ధ్వజమెత్తారు.
కోర్టులు మొట్టికాయలు వేసినా..
‘కేంద్రం చివాట్లు, కోర్టుల మొట్టికాయలు ఏవైనా, వైసీపీ వాళ్ళకు దున్నపోతుమీద వాన చినుకులు పడినట్టే. పీపీఏల రద్దుపై కేంద్ర మంత్రి లేఖలు, కేంద్ర కార్యదర్శి లేఖలు, ఆర్ బీఐ, అప్పిలేట్ ట్రిబ్యునల్, పీఎంవో, విదేశీ ఎంబసీల సహా ఎందరు హెచ్చరికలు చేసినా అన్నింటినీ పెడచెవిన పెట్టారు' అని చంద్రబాబు మండిపడ్డారు.
అవాస్తవాలేనని..
‘ఇప్పుడు తాజాగా పీపీఏల రద్దుపై ప్రభుత్వాన్ని మూర్ఖంగా ముందుకు వెళ్లవద్దని హెచ్చరిస్తూ కేంద్రమంత్రి ఆర్కే సింగ్ లేఖ రాశారు. 3కంపెనీలకు తెలుగుదేశం ప్రభుత్వం దోచిపెట్టిందన్న వైసీపీ నేతల ఆరోపణలన్నీ అవాస్తవాలేనని రుజువులతో సహా ఆ లేఖలో తెలిపారు' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మొట్టికాయలు.. చెంపదెబ్బలు తింటున్నా..
‘నిన్న హైకోర్ట్ జీవో 63ని కొట్టేయడం ఒక చెంపపెట్టు. ఈ రోజు కేంద్రమంత్రి ఆర్ కే సింగ్ లేఖ మరో చెంపపెట్టు. రోజురోజుకూ, పూటపూటా చెంపదెబ్బలు పడుతున్నా వైసీపీ నేతల్లో ఏమాత్రం మార్పురాదు. ఆర్ పీవో పైన, ధరలపైన, గ్యాస్ కేటాయింపులపైన, మస్ట్ రన్ పైన ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని ఆరోపణలు చేసిన అధికారులు ఇప్పుడేమంటారు? వాళ్లను ముందుపెట్టి జగన్నాటకం ఆడించిన వాళ్లేమంటారు? ' అంటూ చంద్రబాబు వరుస ట్వీట్లతో జగన్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు రుణమాఫీ జీవోను రద్దు చేయడంపై చంద్రబాబు జగన్ సర్కారుపై మండిపడ్డారు. ప్రస్తుత ఏపీ సర్కారు టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వుల్ని రద్దు చేయడంపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద కోపం ఉంటే రైతుల మీద ఎందుకు చూపిస్తున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు.