పవన్-జగన్ది ఒకేదారి, కేంద్రం రెచ్చగొడుతోంది: పవన్ వ్యాఖ్యలపై బాబు, గవర్నర్పై విమర్శలు
చిత్తూరు: కేంద్ర వైఖరికి నిరసనగా తిరుపతిలో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం రాత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఏప్రిల్ 30న తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాట్లు.. దివంగత నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మృతితో ఖాలీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థి ఎంపిక, జిల్లాలో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు చర్చించారు. ప్రజలకు మోడీ హామీలు గుర్తుకు వచ్చేలా సభలో ఏర్పాట్లు జరగాలని ఆయన వారికి సూచించారు. పార్టీనేతలు మంత్రులంతా సభకు హాజరుకావాలని ఆయన ఆదేశించారు.
పవన్ వ్యాఖ్యలు బాధించాయి
తిరుపతి సభకు పోటీగా వైసీపీ విశాఖ సభ నిర్వహిస్తోందని చంద్రబాబు తెలిపారు. జగన్-పవన్ ఇద్దరూ ఒకే దారిలో వెళ్తున్నారని అయన అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాన్ వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నిరాధార ఆరోపణలతో ఆయన సాధించేదేమీ లేదని అభిప్రాయపడ్డారు.
Recommended Video
వైసీపీని రెచ్చగొడుతోంది..
వైసీపీని బీజేపీ రెచ్చగొడుతోందని చంద్రబాబు అన్నారు. కేంద్రం అందరినీ ఆడిస్తోందని, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఆటలు సాగినా... ఏపీలో సాగబోవని బాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలిచి.. ప్రధానిని నిర్ణయించే స్థాయికి ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు.
గవర్నర్ వైఖరిపై ఆగ్రహం
కాగా, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను గవర్నరే కలుపుతున్నారనే వార్తలు పత్రికల్లో వస్తున్నాయని ఆయన అన్నారు. గవర్నర్ స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఆ విధంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు.
మంచి పద్ధతి కాదు
అసలు గవర్నర్ వ్యవస్థే వద్దని టీడీపీ గతంలోనే చెప్పిందని... ఆ అంశంపై పోరాటం కూడా చేశామని చెప్పారు. ఒక పద్ధతి ప్రకారం పని చేసుకోవాల్సిన వ్యవస్థ గవర్నర్ వ్యవస్థ అని... వార్తాపత్రికల్లో న్యూస్ వచ్చేలా గవర్నర్ వ్యవహరించడం మంచి పద్ధతి కాదని అన్నారు. సోమవారం విజయవాడలో నరసింహన్, చంద్రబాబులు కలిసిన సంగతి తెలిసిందే.
బయపడేది లేదన్న లోకేష్
ఏపీకి కేంద్రం అన్యాయం చేసినందుకే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి వచ్చిందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్డీఏ నుంచి బయటికొచ్చిన తర్వాత తమ ప్రభుత్వంపై కేంద్ర నిఘా ఎక్కువైందని అన్నారు. ఆ నిఘాకు తాము బయపడబోమని అన్నారు. మనమంతా డిజిటల్ వ్యవస్థలో నడుస్తున్నామని అన్నారు. వాళ్లింకా నాన్ డిజిటల్ అన్నారు.
బీజేపీ కపట నాటకం.. జగన్ సభ అందుకే
వైసీపీ అధినేత వైయస్ జగన్పై మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ దీక్షపై విమర్శలు చేశారు. వంచనకు పెట్టింది పేరు జగన్ అని, విశాఖలో వైసీపీ వంచన దీక్ష చేయడమంటే దొంగే దొంగ అన్నట్టుందని ఎద్దేవా చేశారు. తిరుపతి సభ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే బీజేపీ కపట నాటకమని చెప్పారు. కేసుల మాఫీ కోసం బీజేపీతో జగన్ కుమ్మక్కయ్యారని మంత్రి ఆరోపించారు.