ఏపీ భవన్ ఇష్యూ: కేసీఆర్ తీరుపై ఘాటు వ్యాఖ్య చేసిన చంద్రబాబు
అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలో ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించేందుకు స్వయంగా చంద్రబాబే మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఏపీ భవన్ స్థలంపై కన్నేసిన కేసీఆర్: హోంమంత్రి రాజ్నాథ్కు లేఖ
ఈ సందర్భంగా ఢిల్లీలోని ఏపీ భవన్ స్థలాన్ని తమకు కేటాయించాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాధ్కు లేఖ రాయడాన్ని మీడియా ప్రతినిధులు చంద్రబాబు ముందు ప్రస్తావించారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. కేసీఆర్ తీరుపై మండిపడ్డారు.
ఏపీకి సహకరించాల్సింది పోయి అన్నింటిలోనూ ఇబ్బంది పెడుతున్నారని కేసీఆర్ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ''మనకన్నీ ఇబ్బందులే. ఓ పక్క ఆయన (కేసీఆర్) ఇబ్బంది పెడతాడు. కేంద్రం నుంచి ఇంకా నిధులు రాలేదు. అయినప్పటికీ మనం ముందుకెళ్లాలి. తెలివే మన ధైర్యం. దృఢ సంకల్పంతో ముందుకెళ్లాల్సి ఉంది. 4 శాతం జనాభా ఉన్న ఏపీ... జేఈఈలో 15 ర్యాంకులు దక్కించుకోవడం మన సత్తాకు నిదర్శనం'' అని అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. పూర్వపు హైదరాబాద్ స్థలం మొత్తాన్ని తెలంగాణకే కేటాయించాలని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.
భారత విదేశీ వ్యవహారాలశాఖ రికార్డుల ప్రకారం 1917, 1928, 1936 సంవత్సరాల్లో 18.18 ఎకరాల స్థలాన్ని నిజాం ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ స్థలంలోనే ప్రస్థుత హైదరాబాద్ హౌస్, తెలంగాణభవన్లు ఉన్నాయన్నారు. తిరిగి ఆ స్థలంలో తెలంగాణ వాసుల కోసం సాంస్కృతిక కేంద్రం నిర్మించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.