మోడీ మరీ బరితెగిస్తున్నారు:చంద్రబాబు;ఊరందరిదీ ఒక దోవ అయితే.. చంద్రబాబుది మరో దోవ:జివిఎల్
అమరావతి:మాజీ మంత్రి సుజనా చౌదరి ఆస్తులపై దాడులు కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ట అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
రాజకీయ వేధింపులతో ప్రధాని మోడీ మరీ బరితెగించి పోతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. బుధవారం తెలుగుదేశం పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ విజయనగరంలో టిడిపి ధర్మపోరాటం విజయవంతమైందని, అలాగే మిగిలిన మూడు ధర్మపోరాటాలను కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే పార్టీ సభ్యత్వ నమోదును మరింత ముమ్మరం చేయాలని పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదని అన్నారు. అలాగే డిసెంబర్ నెల 2 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 'బిసి జయహో' నియోజకవర్గ స్థాయి సదస్సులు...అలాగే డిసెంబర్ 30 వ తేదీన రాజమండ్రిలో 'బిసి జయహో' భారీ సభ ఏర్పాటు చేయాలని చంద్రబాబు వివరించారు.
మరోవైపు బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఇందిరాగాంధీతోనే పోట్లాడితే ...చంద్రబాబు నాయుడు ఐటి, ఈడీ దాడులు ఎదుర్కొంటున్న సిఎం రమేష్, సుజనా చౌదరి లను కాపాడటం కోసం రాహుల్ గాంధీకి సరెండర్ అయ్యారని విమర్శించారు.
ఏవిషయంలోనైనా ఊరందరిదీ ఒక దోవ అయితే...చంద్రబాబుది మరో దోవ అని జివిఎల్ దుయ్యబట్టారు. ప్రజలు కాంగ్రెస్ ముక్త్ భారత్ను ప్రజలు కోరుకుంటుంటే... తెలుగుదేశం పార్టీ మాత్రం ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్ పంచన చేరి తెలుగు ప్రజలను నయవంచన చేస్తోందన్నారు. దారినిపోయే శనీశ్వరాన్ని పిలిచి పీట వేస్తున్న తెలుగుదేశం పార్టీకి దారుణ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.