నిన్నటిదాకా కేసీఆర్.. ఇప్పుడు చంద్రబాబు : అదే సెంటిమెంట్తో ఇద్దరూ
హైదరాబాద్ : భారతదేశంలో పండుగలనేవి ఆయా కులమతాలకు సంబంధించిన అంశాలు. నిజానికి వీటిల్లో ప్రభుత్వ జోక్యమనేది ఉండకూడదు. ఉంటే.. గింటే.. ఆయా పండుగలకు అనుగుణంగా సౌకర్యాల కల్పన వంటి అంశాల మీదనే దృష్టి సారించాలి తప్పితే.. ప్రభుత్వమే అధికారికంగా పండుగలను నిర్వహించే పద్దతి ఉండకూడదు.
కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సీన్ పూర్తిగా రివర్స్ లో సాగుతోంది. పండుగలను అధికారికంగా నిర్వహించడం ద్వారా సెంటిమెంటల్ గా ప్రజలను తమవైపు తిప్పుకోవచ్చనే భావన ఇరు రాష్ట్రాల సీఎంలలోను కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుంటారు. రాష్ట్రంలో చాలా పండుగలను అధికారికంగా నిర్వహించే ఆనవాయితీని.. అధికారంలోకి వచ్చాక ఆయన మొదలుపెట్టారు.
ఇక ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు వంతు. ఏడాది పొడుగునా ఉత్సావాలంటూ చంద్రబాబు చేసిన ప్రకటన ఇందుకు ఊతమిస్తోంది. విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నం ఫెర్రీలో దీపావళి సంబరాలు జరుపుకున్నారు చంద్రబాబు. నరకాసుర వధలో పాల్గొన్న అనంతరం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ప్రజలంతా దీపావళిని ఇక్కడే జరుపుకోవాలని సూచించారు.
అందరూ ఒకేచోట దీపావళి జరుపుకోవడం ద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని చెప్పారు. ప్రజలంతా ఎల్లవేళలా సంతోషంగా ఉండడానికి రాష్ట్రంలో ఏడాదంతా వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇవే వ్యాఖ్యలను ఎత్తిచూపుతూ.. ప్రజలకు దగ్గరవడానికి పండుగల సెంటిమెంట్ ను చంద్రబాబు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
పండుగలను నిర్వహించే బాధ్యతలను ప్రభుత్వాలే భుజానికెత్తుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదీగాక.. పవిత్ర సంగమ క్షేత్రాలంటూ ప్రజలంతా ఒకేచోట దీపావళి చేసుకోవాలని పిలుపునిస్తే.. జనం తాకిడి ఎక్కువైతే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. కేవలం పండుగలు ప్రజా సెంటిమెంట్ అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఈ మార్గం ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తుండడం ఆక్షేపనీయమే.