ఎమ్మెల్యేలకు బాబు ర్యాంకులు: సీల్డ్ కవర్లో అందజేత, సీక్రెట్గా ఉంచమని ఆదేశం
అమరావతి: గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీలో టీడీపీ శిక్షణా తరగతులు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలకు ప్రగతి నివేదికలను అందజేశారు. ఎమ్మెల్యేల పనితీరు, ర్యాంకులను సీల్డ్ కవర్లో నివేదికలను అందజేశారు.
ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు సర్వే చేయించారు. ఈ సర్వే ఆధారంగా వారికి ర్యాంకులు కేటాయించడం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా వారికి ఏ,బీ,సీ,డీ ర్యాంకులను సీఎం చంద్రబాబు నాయుడు కేటాయించారు. అయితే, సీల్డు కవర్ల ద్వారా వారికి ఈ ర్యాంకులను అందజేశారు.
సీల్డ్ కవర్లోని విషయాలను అత్యంత గోప్యంగా ఉంచాలని ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ప్రజాప్రతినిధులపై మూడు నెలలకొకసారి సర్వే చేయిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పనుల్లో కుటుంబ సభ్యులు జోక్యాన్ని రానివ్వద్దని చంద్రబాబు నేతలకు సూచించారు. అధికారంలో ఉన్న వారు తప్పు చేస్తే ప్రజలు ఊరుకోరని ఆయన హెచ్చరించారు.
ప్రజలు ఇప్పుడేమీ మాట్లాడరని, ఎన్నికల్లో సైలెంట్గా జడ్జిమెంట్ ఇస్తారని పేర్కొన్నారు. కార్కకర్తల శిక్షణా తరగతుల్లో ఆఖరి రోజైన గురువారం పార్టీలో పదవులపై తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పార్టీలో ఒక వ్యక్తికి ఒకటే పదవి ఇవ్వనున్నారు.
ఈమేరకు కేఎల్ యూనివర్శిటీలో జరుగుతున్న టీడీపీ శిక్షణా తరగతుల్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వారికి పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. నాయకుల పిల్లలకు ఎన్టీఆర్ స్కూల్లో సీట్లు, వృత్తి నైపుణ్య కేంద్రాల్లో శిక్షణ, ఉద్యోగాలను కల్పించనున్నారు.
Glad to have KL University's enthusiastic students help our party karyakartas in digital proficiency. pic.twitter.com/yUDjOIhLdM
— N Chandrababu Naidu (@ncbn) October 5, 2016
వచ్చే నెల నుంచి టీడీపీ కోర్ డ్యాష్బోర్డును ఏర్పాటు చేయనున్నారు. అలాగే జాతీయ అధికార ప్రతినిధులు, సీనియర్ నేతలు టీవీ డిబేట్లు, చర్చలకు వెళ్లాల్సిందేనని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం సీఎం చంద్రబాబుతో టీడీపీ ముఖ్య నేతలు కళావెంకట్రావు, యనమల రామకృష్ణుడు, టీడీ జనార్దన్, నారా లోకేశ్ తదితరులు భేటీ అయ్యారు.
On Day 2 of TDP workshop, elaborated on how people's satisfaction with Govt is our priority. pic.twitter.com/09hES78COT
— N Chandrababu Naidu (@ncbn) October 5, 2016
ఈ నెల 15 నుంచి పార్టీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు చేపట్టనున్న జనచైతన్య యాత్ర, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై ఈ సమావేశంలో చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది.