ఉగాది రోజున మనవడి విందుకు రండి: మంత్రులు, అధికారులకు చంద్రబాబు
అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు వేడుకలను అమరావతిలో జరపనున్నట్లు తెలిసింది. దేవాన్ష్ పుట్టిన రోజు వేడుకలకు కుటుంబాలతో సహా రావాలని శనివారం సచివాలయంలో మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, శాఖల అధిపతులను ఆయన ఆహ్వానించారు.
నిజానికి ఇటీవలే తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్లో చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తిథుల ప్రకారం మనవడి పుట్టినరోజు ఉగాది రోజున వచ్చిందట. దీంతో ఆరోజు మళ్లీ తన మనవడి పుట్టినరోజు వేడుకను జరపాలని చంద్రబాబు నిర్ణయించారట.
కాబట్టి 'ఏప్రిల్ 8న ఉగాదినాడు రాజధాని అమరావతిలో నా మనవడి పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నాం. మొన్న తేదీ ప్రకారం జరిపాం. తిథుల ప్రకారం ఉగాది రోజు వచ్చింది. ఆ రోజు మళ్లీ జరుపుతున్నాం. విందుకు ఆ రోజు మీరంతా తప్పనిసరిగా కుటుంబాలతో సహా రావాలి' అంటూ అందరినీ ఆయనే స్వయంగా ఆహ్వానించారు.
అయితే ఉగాది రోజున అన్ని జిల్లాల్లో పక్కా ఇళ్ల శంకుస్ధాపనలు చేయాలకున్నామని కొందరు మంత్రులు గుర్తుచేయగా.... దీనిపై కాసేపు చర్చించిన చంద్రబాబు శంకుస్థాపనల కార్యక్రమాన్ని ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజుకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు.. రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిన ఉద్దండ్రాయునిపాలెంలో అధికారికంగా ఉగాది వేడుకలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు.
కాగా సీఎం చంద్రబాబు నాయుడుతో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ ఆదివారం భేటీ కానున్నారు. హైదరాబాద్ మదీనగూడలోని చంద్రబాబు ఫాంహౌస్లో సుమారు గంటకు పైగా ఈ భేటీ జరుగుతుందని పార్టీ వర్గాల సమాచారం. ఈ భేటీలో చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని తెలిసింది.
గతేడాది జనవరి చివరివారంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సివిల్ సర్వీసెస్ అధికారులకు యోగా శిక్షణ ఇచ్చారు. జగ్గీ వాసుదేవ్ సంస్థలు ఏర్పాటుచేసేందుకు అనువుగా కృష్ణా జిల్లాలో 400 ఎకరాల భూమిని ఇచ్చేందుకూ సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.