అసెంబ్లీ ముట్డడిస్తాం: వైసీపీ ఇక బంగాళాఖాతంలోకే: చంద్రబాబు ఏకిపారేశారు
పశ్చిమగోదావరి: రాజధాని అమరావతి తరలింపు విషయంపై మరోసారి తీవ్రస్తాయిలో జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ర్యాలీలో చంద్రబాబు ప్రసంగించారు.
రైతులకు జగన్ వెన్నుపోటు..
రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను సీఎం వైఎస్ జగన్ వెన్నుపోటు పొడిచారని చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని అంశం రైతులకు సంబంధించిన విషయం మాత్రమే కాదని.. రాష్ట్ర ప్రజలందరికీ, భవిష్యత్ తరాలకు సంబంధించినదని ఆయన అన్నారు. రాజధాని అమరావతి కోసం రైతులు 32 రోజులుగా రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తున్నారని చెప్పారు.
మహిళలపై ఇంత దారుణంగానా?
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై దాడులు చేస్తూ వారిని బూటుకాలుతో తన్నడం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు. మహిళలపై దాడికి పాల్పడుతూ సీఎం జగన్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డిని సంతోషపెట్టేందుకు పోలీసులు బలపశువులు అవుతున్నారని అన్నారు.
వైసీపీ బంగాళాఖాతంలోకే.. 20న అసెంబ్లీ ముట్టడి
అమరావతిని కాపాడుకునే బాధ్యత రాష్ట్ర యువతపై ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిని తరలిస్తే ప్రజలు అధికార వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తారని అన్నారు. జనవరి 20న అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ.. గత టీడీపీ కంటే మెరుగైన పాలన అందించడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. టీడీపీ హయాంలో ఎవరైనా స్వేచ్ఛగా సమావేశాలు పెట్టుకునేందుకు అవకాశం కల్పించామని తెలిపారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు.
విశాఖపై కాదు.. అక్కడి భూములపైనే వైసీపీకి ప్రేమ..
విశాఖ అంటే తనకూ ఇష్టమేనని.. ఈరోజు రాజధాని రైతులను మోసం చేసిన వ్యక్తులు భవిష్యత్లో విశాఖ వాసులను మోసం చేయరని నమ్మకం ఏంటని ప్రశ్నించారు చంద్రబాబు. విశాఖ ప్రజల మీద వైసీపీ నేతలకు ప్రేమ లేదని.. అక్కడి భూముల మీద మాత్రమే ఉందన్నారు. విశాఖలో భూములను దోచుకునేందుకే రాజధాని మార్పు చేస్తోందని వైసీపీపై మండిపడ్డారు. మద్రాస్ ఐఐటీ నివేదిక అన్నారని.. వాళ్లు ఆ నివేదికే ఇవ్వలేదని రుజువైందని చెప్పారు. కాగా, ర్యాలీ సందర్భంగా చంద్రబాబు జోలే పట్టి విరాళాలు సేకరించారు.