గుజరాత్ తరహా విధ్వేషాగ్నికి కుట్ర..ఎన్నికల సంఘంలో బీజేపీ మనుషులు: చంద్రబాబు ఫైర్
అమరావతి: భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా రోడ్షో సందర్భంగా పశ్చిమ బెంగాల్లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రతోనే బీజేపీ ఈ హింసకు తెగబడిందని ఆరోపించారు. రాజకీయంగా లబ్ది పొందడానికి ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. రాజ్యాంగ సంస్థలను ప్రయోగించింది చాలక.. రౌడీలు, గూండాలను కూడా రంగంలో దింపారని ధ్వజమెత్తారు.
సీబీఐ, ఈడీ, ఐటీలకు భయపడలేదని..
రాజకీయ ప్రత్యర్థులపైకి రాజ్యాంగ బద్ధమైన సంస్థలను ప్రయోగించడం బీజేపీకి అలవాటుగా మారిందని చంద్రబాబు విమర్శించారు. అయినప్పటికీ తాము భయపడేది లేదని అన్నారు. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను అధికారులతో దాడులు చేయించిందని, వాటికి భయపడకపోవడం వల్ల చివరికి ప్రజాస్వామ్య విరుద్ధంగా రౌడీలు, గూండాలతో భయోత్పాతం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ నాయకులు గూండాలను నేరుగా రంగంలోకి తెచ్చారని విమర్శించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలపై విలువ లేని వారు ఇటువంటి చర్యలకు పాల్పడుతారని అన్నారు. మమతా బెనర్జీకి సంఘీబావం తెలుపుతున్నానని ప్రకటించారు.
గుజరాత్ తరహా విధ్వేషాగ్నికి కుట్ర..
ధర్మో రక్షతి రక్షిత: అనే స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ ప్రవర్తిస్తోందని అన్నారు. హింస ద్వారా రాజకీయాలను చేసే మోడీ-అమిత్ షాల జోడీని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. ఈ దేశం మొత్తం గుజరాత్లా మార్చేయడానికి మోడీ-షా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీకి అసలు బలం లేదని, దేశ రాజకీయాల్లో సీనియర్ మహిళా రాజకీయ నాయకురాలు మమతా బెనర్జీపై మూకుమ్మడి దాడులు చేస్తున్నారని, రాక్షసుల్లా విధ్వంసం సృష్టిస్తున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
మమతా బెనర్జీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చి ఎన్నికల్లో లబ్ది పొందడానికి బీజేపీ కుట్ర పూరిత రాజకీయాలను చేస్తోందని మండిపడ్డారు. వికృత మోడీ-షాల పాచిక పారదని, దాన్ని అడ్డకుంటామని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో అమిత్ షా ఉద్దేశూరకంగానే తన ర్యాలీలో గూండాలతో అల్లర్లు సృష్టించారని, గతంలో గుజరాత్లో కూడా అమిత్ షాను అడ్డుపెట్టుకొని మోడీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ప్రజలందరికీ తెలిసిన విషయమేనని అన్నారు.
ఎన్నికల ప్రచారంలో నెలకొన్న హింసాత్మక పరిస్థితులను అడ్డుగా పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తోందని చంద్రబాబు అన్నారు. ఒకరోజు పాటు ఎన్నికల ప్రచార సభలను రద్దు చేయడం వెనుక ఉద్దేశమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా నిర్ణయం తీసుకుందని ధ్వజమెత్తారు. నరేంద్ర మోడీకి క్లీన్చిట్ ఇవ్వడంతోనే కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని అన్నారు. బీజేపీ ఇచ్చే తప్పుడు నివేదికలను సమర్థిస్తూ, ప్రతిపక్ష పార్టీల నాయకుల విజ్ఞప్తులను పక్కన పెడుతూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ద్వంద్వనీతిని అవలంభిస్తున్నారని ఆరోపించారు.