ఎంపీ సీట్లూ తగ్గిస్తారేమో, ఇక దక్షిణాది గొంతు వినిపించదు: చంద్రబాబు ఆందోళన
అమరావతి: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాలకు నిధుల పంపిణీలో 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
అంతేగాక, భవిష్యత్తులో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకూ ఆ లెక్కల్నే పరిగణనలోకి తీసుకుంటామంటే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. సచివాలయంలో సోమవారం జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
దక్షిణాది గొంతు వినపడదు
గతంలో జరిగిన రెండు పునర్విభజనలను 1971 జనాభా లెక్కల ప్రాతిపదికనే చేశారని తెలిపారు. ‘దక్షిణాదిలో ఇప్పుడు 100 లోక్సభ స్థానాలున్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేస్తే వీటి సంఖ్య 70కో, 50కో పడిపోతుంది. అప్పుడు దక్షిణాది రాష్ట్రాల గొంతు ఈ మాత్రం కూడా వినపడదు. ఈ రాష్ట్రాలను ఎవరూ పట్టించుకోరు' అని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
శిక్షిస్తామనడం దారుణం
అభివృద్ధి పథంలో ప్రయాణిస్తున్న రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాల్సింది పోయి, శిక్షిస్తామనడం దారుణమని చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని గౌరవించాలన్నారు. 15వ ఆర్థిక సంఘానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ‘టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్'లోని అంశాలు రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాల్ని తుంగలో తొక్కేలా ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రాలకు న్యాయం జరిగేంతవరకూ పోరాడదామని, రాష్ట్రపతిని కలసి వినతిపత్రం అందజేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.
కేంద్రంతో పోరాటం కొత్తేం కాదు
14వ ఆర్థిక సంఘం నుంచే రాష్ట్రాల ప్రయోజనాల్ని దెబ్బతీయడం మొదలైందని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రంపై పోరాడటం టీడీపీకి కొత్త కాదని, ఎన్టీఆర్ హయాంలోనే కేంద్ర రాష్ట్ర సంబంధాలపై పోరాటం సాగించామని చంద్రబాబు తెలిపారు. దాని ఫలితంగానే సర్కారియా కమిషన్ ఏర్పాటైందని చెప్పారు.
ఉల్లంఘనలకు పాల్పడుతున్న కేంద్రం
దేశంలో అన్నిచోట్లా వనరులున్నాయని. దక్షిణ భారతంతో పోలిస్తే ఉత్తర భారతంలోనే జల వనరులు ఎక్కువని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాలన్నీ ఒక దానితో మరొకటి పోటీపడి అభివృద్ధి చెందాలని, కొన్ని రాష్ట్రాలు వెనుకబడ్డాయని మిగతా రాష్ట్రాలను శిక్షిస్తామనడం సరికాదని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎంను పట్టించుకోకుండా కావాల్సినంత అప్పులు తెస్తోందని ధ్వజమెత్తారు. అయితే, రాష్ట్రాలను మాత్రం వద్దంటోందని అన్నారు. అంతేగాక, కేంద్ర ప్రభుత్వమే ఎక్కువగా ఉల్లంఘనలకు పాల్పడుతోందని చంద్రబాబు ఆరోపించారు.