అందుకే వెంటనే: కేంద్రం-టీఆర్ఎస్పై బాబు సంచలనం, తెలంగాణకు సోనియా
హైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం పార్టీ వర్క్ షాప్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం, టీఆర్ఎస్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ సర్కార్ బిల్లులకు తక్షణమే ఆమోదం లభిస్తోందన్నారు. అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జోన్ల కోసం ఢిల్లీకి వెళ్లగా వెంటనే ఆమోదం తెలుపుతూ గెజిట్ జారీ చేశారని ఏపీ సీఎం పరోక్షంగా ప్రస్తావించారు.
తెలంగాణలో ఏంజరుగుతోంది: అసెంబ్లీ రద్దుపై బాబు ఆరా, కేసీఆర్కు ధీటుగా!
తెలంగాణలో పొత్తుల గురించి అడగగా..
తెలంగాణలో పొత్తుల విషయమై పలువురు తెలంగాణ ప్రాంతానికి చెందిన పార్టీ నేతలు అధినేతను అడిగారు. ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పొత్తుపై స్పష్టత ఇవ్వాలని వారు కోరారు. అయితే దానిపై ఆయన ఏం స్పందించలేదని తెలుస్తోంది.
ఏపీ పట్ల కేంద్రం కక్ష సాధింపు
తెలంగాణకు అనుకూలంగా ఉన్న కేంద్రం, ఏపీ విషయంలో మాత్రం అననకూలంగా ఉందని చంద్రబాబు అన్నారు. కేంద్రం నవ్యాంధ్రకు నిధులు ఇవ్వడం లేదని, పీడీ అకౌంట్లపై మాత్రం బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇవ్వాలన్నారు. టీఆర్ఎస్ కేంద్రంతో దగ్గరగా ఉందని, అందుకే అన్నీ ఆమోదిస్తున్నారని, మనకు మాత్రం అలా చేయడం లేదని, ఏపీ పట్ల కేంద్రం కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణలో ముందస్తు ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలంగాణ వ్యవహార శైలిపై ఇటీవల ఆయన దాదాపు తొలిసారి స్పందించారు.
మీ జాతకాలు నా వద్ద ఉన్నాయని హెచ్చరిక
టీడీపీ వర్క్ షాప్లో ఏపీ ఎమ్మెల్యేలకు, నేతలకు చంద్రబాబు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎమ్మెల్యేలు, నేతల అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. ప్రజలకు సేవ చేసే గెలుపు గుర్రాలనే వచ్చే ఎన్నికల్లో ఎంపిక చేస్తానని చెప్పారు. పనితీరు మెరుగుపర్చుకోవాలని ఎమ్మెల్యేలకు ఎప్పటి నుంచో చెబుతున్నానని అన్నారు. ఇవాళ ప్రగతి నివేదికలు ఇస్తానని, అందరితో వ్యక్తిగతంగా మాట్లాడుతానని చెప్పారు. పార్టీ ఉంటేనే మనం ఉంటామనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. అహం వీడకుంటా ఇబ్బందులు తప్పవన్నారు.
తెలంగాణలో సోనియా గాంధీ పర్యటన
ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో యూపీఐ చైర్ పర్సన్ సోనియా గాంధీని తెలంగాణకు తీసుకు రావాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ నెల 14న ఆమె తెలంగాణలో పర్యటించే అవకాశముంది. నిజామాబాద్ లేదా కరీంనగర్లలో సోనియా సభకు ప్లాన్ చేస్తున్నారు. సోనియా తెలంగాణ పర్యటన గురువారం ఖరారు కానుంది.