బాలల థియేటర్ ప్రారంభించిన సీఎం; జగన్ వల్లే శ్రీలక్ష్మి బలైందన్న ధూళిపాళ్ల!
విశాఖ పర్యటనలో భాగంగా వుడా బాలల థియేటర్ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా వుడా బాలల థియేటర్ను సీఎం ప్రారంభించారు. అనంతరం చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విజేతలకు చంద్రబాబు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసర రావు, విశాఖ ఎంపీ హరిబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, బాలల థియేటర్ కోసం రూ.22కోట్లు ఖర్చు చేసినట్టుగా వుడా వైస్ చైర్మన్ బాబురావు తెలిపారు.
గ్రౌండ్ ఫ్లోర్ లో 400మంది, మొదటి అంతస్తులో 600మంది కూర్చునేలా థియేటర్ నిర్మాణం చేసినట్టు బాబురావు వివరించారు.
వైఎస్ ను అడ్డుపెట్టుకుని దోచుకున్న జగన్:
తండ్రిని అడ్డుపెట్టుకొని జగన్ భారీగా అవినీతికి పాల్పడ్డారని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. శుక్రవారం నాడు సుద్దపల్లిలో జగన్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ లక్ష్యంగా పెట్టుకొని పర్యటలు చేస్తున్నారని విమర్శించారు.
శనివారం నాడు గుంటూరులో మీడియాతో మాట్లాడిన ధూళిపాళ్ల నరేంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై అనవసరం విమర్శలు చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఓబులాపురంలో జగన్ మైనింగ్ ధనదాహానికి ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి బలైందని అన్నారు.