'సిటీ ఆఫ్ ఎక్సలెన్స్' గా తిరుపతి: పేదవాడికి పప్పన్నం పెట్టాలనే చంద్రన్న కానుక
అమరావతి: తిరుపతిని మెగా సిటీగా అభివృద్ధి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం తిరుపతిలోని హోటల్ మానస సరోవర్లో ఫుడ్ ఫెస్టివల్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగంలో తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
పేదవాడికి పప్పన్నం పెట్టాలన్న ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం చంద్రన్న కానుక ప్రవేశపెట్టినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో హోటల్స్ రంగం అభివృద్ధి చెందాలని చెప్పిన ఆయన వచ్చే సంక్రాంతికి అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
బెంగుళూరు, చెన్నైలను కలుపుతూ పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. తిరుపతి నగరంలోని అన్ని చెరువులను సుందరీకరణ చేసి సిటీ ఆఫ్ ఎక్సలెన్స్గా మారుస్తామని ఆయన చెప్పారు. వారసత్వంగా వస్తున్న వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన వివరించారు.
ఇంటికొక కూచిపూడి కళాకారుడుండాలని ఆయన కోరారు. ఏపీలోని అన్ని గ్రామాలను ఆకర్షణీయంగా తయారు చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన చెప్పారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రూ. 5 లక్షల కోట్లు విలువైన ఒప్పందాలు కుదిరాయని ఆయన గుర్తుచేశారు.
హస్తకళల అభివృద్ధికి రూ. 17 కోట్లను కేటాయించినట్లు ఆయన తెలిపారు. అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు గురువారం రాత్రికి నారావారిపల్లె చేరుకొనున్నారు.
శుక్ర, శనివారాల్లో నారావారిపల్లెలోనే నిర్వహించనున్న చంద్రబాబు పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో పోలీసులను భారీగా మోహరించారు.