1200 కోట్లు: ఇంద్రానూయి, అందుకేనని చంద్రబాబు
చిత్తూరు: తాము శ్రీ సిటీలో రూ.1200 కోట్ల పెట్టుబడులు పెడతామని, తొలి దశలో రూ.550 కోట్ల పెట్టుబడులు పెట్టామని పెప్సికో చైర్ పర్సన్ అండ్ సీఈవో, ఇండియా ఇంద్రనూయి శుక్రవారం అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీ సిటీ సెజ్లో పెప్సికో ప్లాంటు ప్రారంభోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రానూయి మాట్లాడారు. వ్యవసాయ ఉత్పత్తుల పైన పరిశ్రమలు స్థాపిస్తామని ఆమె చెప్పారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. తిరుపతి - నెల్లూరు మధ్యలో మరో హార్బర్ పెట్టి పారిశ్రామికవాడగా అభివృద్ధి చేస్తామన్నారు. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి ఉంటేనే ఉద్యోగాలు వస్తాయన్నారు. అందుకే ఇండస్ట్రియల్ క్లియరెన్స్ను త్వరగా ఇస్తున్నామని చెప్పారు.
రేపు ఢిల్లీకి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన రేపు సాయంత్రం వెళ్తారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చే విందుకు హాజరు కానున్నారని సమాచారం. కాగా, శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగాయి. వాటి పైన చంద్రబాబు ఆరా తీశారు. సమీపంలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.