ధనవంతులపై బాబు ఆసక్తికర వ్యాఖ్య, 'హెలికాప్టర్ ద్వారా విత్తనాలు చల్లుతారు'
విజయవాడ: ఏపీలో జానాభా తగ్గుతోందని, ధనికులు ఒకే బిడ్డతో ఆగిపోతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు విజయవాడలో చిన్నారులకు పౌష్టికాహారం పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పదేళ్లలో పౌష్టికాహార లోపంలేని ఏపీని చూడాలన్నారు. పిల్లలకు పోషకాహారాన్ని అందించడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. గర్భిణిలకు పౌష్టికాహారం అందించేందుకు అన్న అమృత హస్తం పథకానికి శ్రీకారం చుట్టామన్నారు.
పౌష్టికాహార లోపాన్ని అరికట్టే ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చంద్రబాబు చెప్పారు. పౌష్టికాహార లోపంపై అసెంబ్లీలో చర్చిస్తామని తెలిపారు. న్యూట్రిషన్ మిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. పౌష్టికాహార లోపంపై ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలని చంద్రబాబు చెప్పారు.
విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ... మొక్కల పెంపకంతో వాతావరణ కాలుష్యం తగ్గుతుందని, విజయవాడలోని కొండలపై హెలికాప్టర్ ద్వారా సీఎం విత్తనాలు చల్లుతారని తెలిపారు.
ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. విజయవాడ మధ్య నియోజకవర్గంలో 2.5లక్షల మొక్కలు నాటేందుకు సంకల్పించిన ఎమ్మెల్యే బొండా ఉమను పలువురు అభినందించారు. ప్రభుత్వం 50 కోట్ల మొక్కలు సిద్ధం చేసిందని, మొక్కలుపెంచే బాధ్యతను అందరూ తీసుకోవాలని బొండా ఉమ కోరారు.