ఆస్తి ఎక్కువైతే: హైదరాబాద్పై బాబు షాకింగ్, దానిపై పదేపదే.. జగన్-రోజాల ఎఫెక్టా?
హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కుప్పం: హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఆస్తులు ఎక్కువయితే చెడు అలవాట్లు వస్తాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారమే నిదర్శనం అన్నారు.
ఆ పరిస్థితి రాదు..
హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారం గురించి మాట్లాడుతూ.. ఏపీలో అలాంటి పరిస్థితి రాదని చంద్రబాబు చెప్పారు. త్వరలోనే బెల్టు షాపులను మూసేస్తామని స్పష్టం చేశారు. త్వరలో హంద్రీనీవా కాలువ నుంచి 139 కిలో మీటర్ల మేర కుప్పం వరకు రూ.450 కోట్లతో కాలువ నిర్మాణం చేపడతామని చెప్పారు.
బెల్టు షాపులను ఉపేక్షించం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెల్టు షాపులను ఉపేక్షించమని చంద్రబాబు చెప్పారు. అభివృద్ధి ఏదైనా తాను కుప్పం నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తానని చెప్పారు. ఆయన గురువారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
జగన్-రోజా ఎఫెక్ట్.. పదేపదే బెల్టు షాపులు
చంద్రబాబు సహా టిడిపి ఇటీవల పదేపదే బెల్టు షాపుల గురించి మాట్లాడుతోంది. అక్రమ బెల్టు షాపులను మూసేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇటీవల కేబినెట్ సమావేశంలోని ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. అయితే, మద్యంపై వైసిపి అధినేత జగన్ ప్రకటన, పది రోజుల్లో చర్యలు తీసుకోకుంటే తామే పగులగొడతామని రోజా హెచ్చరించినందు వల్లే టిడిపిలో కదలిక వచ్చిందని వైసిపి చెబుతోంది.
టిడిపి కౌంటర్
బెల్టు షాపులపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తుంటే వైసిపి నేతలు మాత్రం తాము బెదిరిస్తే చర్యలు చేపడుతున్నారని చెప్పడం విడ్డూరమని టిడిపి నేతలు అంటున్నారు. ఎవరికో భయపడి తాము పనులు చేయడం లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు.