మోడీ మారిపోయాడని పొత్తు పెట్టుకున్నా: చంద్రబాబు కొత్త ట్విస్ట్, సర్వేలు.. పెరిగిన ఆదరణ
అమరావతి: కేబినెట్ భేటీలో, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం భేటీలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు తాను పదేళ్లు ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడ్డానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కార్యకర్తల తెగువ, ధైర్యమే టీడీపీని కాపాడాయని చెప్పారు.
130 ఏళ్ల రాజకీయ పార్టీ ఓట్ల శాతం పడిపోయింది
130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం 2శాతానికి పడిపోయిందని చంద్రబాబు చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు దూరమైందని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విభజన దరిమిలా కొత్త రాష్ట్రానికి అనేక ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. నాలుగేళ్లుగా సమస్యలపై పోరాడుతూనే పునాదుల నుంచి రాష్ట్రాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు.
నరేంద్ర మోడీ మారాడని పొత్తు పెట్టుకున్నా
అప్పట్లో గుజరాత్లో నరేంద్ర మోడీ అరాచకాలను ఖండించామని చంద్రబాబు అన్నారు. నరేంద్ర మోడీ మారాడు అనే ఉద్దేశ్యంతో 2014లో తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని చెప్పారు. కానీ ఆయన మారలేదని నాలుగేళ్ల తర్వాత తెలిసిందని చెప్పారు. వెలుగొండకు శంకుస్థాపన చేసింది తానే అని చెప్పారు. వెలుగొండపై రూ.4,131 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. రాబోయే వర్షాకాలానికి వెలిగొండ పూర్తి చేస్తామని చెప్పారు.
కేటీఆర్ వ్యాఖ్యలు మనకే అడ్వాంటేజ్
మరోవైపు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పది మంది పారిశ్రామికవేత్తలను తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని కేబినెట్ భేటీ సందర్భంగా ఓ మంత్రి వ్యాఖ్యానించారు. ఇటీవల తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు టీడీపీకే అడ్వాంటేజ్ అయ్యాయని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. కేటీఆర్ వ్యాఖ్యలు అడ్వాంటేజ్ అయ్యాయని కౌంటర్లు ఇవ్వకుంటే ఎలా అని ఈ సందర్భంగా చంద్రబాబు.. అచ్చెన్నాయుడికి చురకలు వేశారు.
సర్వేల్లో మన దూకుడు
జాతీయస్థాయిలో బీజేపీకి ఘోరమైన పరాభవం తప్పదని మరో మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. పుల్వామా ఘటనను తమకు అనుకూలంగా మలుచుకొని ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందాలని చూస్తోందని మరో మంత్రి వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ సఫాయి కార్మికుల కాళ్లు కడగడం వంటి సంఘటనలు చూస్తోంటే ఆయన ఫ్రస్టేషన్లో ఉన్నారని స్పష్టంగా తెలిసిపోతోందని సీఎం అన్నారు. మోడీకి బీజేపీలో కూడా అంతర్గతంగా ఇబ్బంది ఎదురవుతుందని జోస్యం చెప్పారు. ఇటీవల పలు సర్వేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటంపై కూడా ఈ భేటీలో ప్రస్తావన వచ్చింది. అలాగే టీడీపీ సర్వేలపై కూడా చర్చ జరిగింది. జనవరితో పోల్చుకుంటే ఫిబ్రవరిలో పార్టీకి మూడు శాతం ఆదరణ పెరిగిందని చంద్రబాబు చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ కంటే టీడీపీ ధీటుగా దూసుకెళ్తోందని చెప్పారు.