52 వేల మందికి భోజనం: పరిహారం కోసం దరఖాస్తు చేసుకోండి: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి: ఫోని తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుస ట్వీట్లను సంధించారు. ప్రవర్తనా నియమావళిని ఎత్తేసిన వెంటనే- ఆయన ట్వీట్లకు పని చెప్పారు.గురు, శుక్రవారాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సహాయ, పునరావాస చర్యలను ఆయన వెల్లడించారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) అందించిన పక్కా సమాచారం వల్లే తాము తుఫాన్ ను ఎదుర్కొన్నామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, రైల్వే అధికారులు ప్రశంసించడం ఆనందాన్ని ఇస్తోందని చంద్రబాబు అన్నారు.
52 వేల మందికి భోజనం
ఫొని తుఫాను నేపథ్యంలో..గురువారం నాడు షెల్టర్లలో తలదాచుకుంటున్న 52,812 మంది నిరాశ్రయులకు భోజనాలను పెట్టామని అన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేస్తోన్న మధ్యాహ్న భోజన పథకం కింద- నిరాశ్రయులకు ఆహారాన్ని అందించినట్లు చెప్పారు. 19 వేల 129 మందికి మధ్యాహ్న భోజనాన్ని, మరో 33,200 మందికి రాత్రి భోజనాన్ని సరఫరా చేసినట్లు చెప్పారు.
శుక్రవారం ఉదయం 9,403 మందికి అల్పాహారాన్ని అందించినట్లు చంద్రబాబు చెప్పారు. నష్ట పరిహారాల కోసం తుఫాను బాధితులు దరఖాస్తులను అందజేయాలని సూచించారు. తమ దరఖాస్తులను పీపుల్ ఫస్ట్ యాప్ లేదా ఆర్టీజీఎస్ వెబ్ సైట్, కైజాల ఏపీ సీెం కనెక్ట్ ద్వారా నమోదు చేసుకోవాలని అన్నారు.
తుపాను ప్రభావిత మండలాల్లో యుద్ధప్రాతిపదికన వైద్య సేవలు అందిచేలా చర్యలు చేపట్టామని చంద్రబాబు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలల్లో 18 మండలాల పరిధిలోని 1546 గ్రామాలలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దీనితోపాటు- 41 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 41 మంది వైద్యులు, 89 మంది పర్యవేక్షక సిబ్బంది, 349 పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచామని, 1031 ఆశా వర్కర్లను అత్యవసర వైద్య సేవలను అందించడానికి సన్నద్ధులను చేశామని చెప్పారు. తుపానుపై ఆర్టీజీఎస్ అందించిన సమాచారం కారణంగానే ముందస్తు చర్యలు తీసుకోగలిగామని ఒడిశా ప్రభుత్వం పేర్కొనడం, రైల్వే శాఖ ఆర్టీజీఎస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలపడం తనకు సంతోషంగా ఉందని చంద్రబాబు చెప్పారు.