చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్కు పట్టిన కరోనా వైరస్ : వైసీపీ ఎమ్మెల్యే
చైనాలో కరోనా వైరస్లా ఆంధ్రప్రదేశ్కి చంద్రన్న వైరస్ పట్టిందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. చంద్రన్న వైరస్కు ఆయన బతికున్నంత కాలం మందు దొరకదని విమర్శించారు. చంద్రబాబు ఎక్కడుంటే అక్కడ నాశనం, వినాశనం, విధ్వంసమే జరుగుతుందన్నారు. ఆదివారం విశాఖలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
నిజ నిర్దారణ కమిటీ అక్కడ వేసుకోండి..
విశాఖలో భూ కుంభకోణం జరిగిందంటూ టీడీపీ రాద్ధాంతం చేస్తోందని.. కానీ వారి హయాంలోనే వేల ఎకరాలు కబ్జా అయ్యాయని ఆరోపించారు. నిరాధార ఆరోపణలతో వైసీపీపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విశాఖపట్నంలో భూదోపిడీలకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నిజనిర్ధారణ కమిటీ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు.నిజ నిర్ధారణ కమిటీ విశాఖలో కాదని.. అమరావతిలో వేసుకోవాలని అమర్నాథ్ సూచించారు.
ఆ మూడు గ్రామాల అభివృద్దే చాలా..
చంద్రబాబుకు అన్ని జిల్లాల అభివృద్ధి అవసరం లేదా.. కేవలం 3 గ్రామాల అభివృద్ధే కావాలా..? అని ప్రశ్నించారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్పై టీడీపీ స్టాండ్ ఏంటని నిలదీశారు. విశాఖ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని తప్పుడు ప్రచారాలు చేసి ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలపై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సిగ్గు లేకుండా టీడీపీ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
టీడీపీ నిజనిర్దారణ కమిటీ
విశాఖలో భూ కబ్జాలపై వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామని టీడీపీ నిజ నిర్దారణ కమిటీని వేసిన సంగతి తెలిసిందే. నిజ నిర్ధారణ కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు, పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్లను నియమించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో విశాఖలో భూ కబ్జాలు, పులివెందుల పంచాయతీలు పెచ్చుమీరడంతో విశాఖ ప్రజలు అశాంతికి, ఆందోళనలకు గురవుతున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు వైసీపీ మాత్రం టీడీపీ ఆరోపణలను తిప్పి కొడుతోంది. విశాఖలో ఎలాంటి భూకబ్జాలు,ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని చెబుతోంది.