'విదేశాల్లో అంత దమ్మున్న నేత, పాకిస్తాన్కు చంద్రబాబు మోస్ట్ వాంటెడ్ పర్సన్!'
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు మరోసారి మండిపడ్డారు. ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రిని విదేశాల్లో విమర్శిస్తే అందరినీ విమర్శించినట్లే అన్నారు.
విదేశాలతో రహస్య ఒప్పందం ఉందా చెప్పాలని విష్ణు నిలదీసారు. ఇదేనా మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం అన్నారు. విదేశాల్లో పర్యటించినప్పుడు మోడీ గురించి చులకనగా మాట్లాడి దేశం పరువు తీస్తున్నారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పాకిస్తాన్కు మోస్ట్ వాంటెడ్ పర్సన్గా మారారని ఎద్దేవా చేశారు.
పటేల్ విగ్రహానికి 2500 కోట్లు, అమరావతికి 1500 కోట్లా?: మోడీకి బాబు, అమరావతికి సింగపూర్ 'తెలుగు' సాయం
చంద్రబాబు రాజకీయాలు చూస్తుంటే పాక్కు మోస్ట్ వాంటెడ్ పర్సన్ సీఎం చంద్రబాబు అని, అలా అనడానికి కారణం ఉందని విష్ణు చెప్పారు. విదేశాలకు వెళ్లి భారత ప్రధాని మీద మాట్లాడే ధైర్యం, దమ్ము ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబేనని దుయ్యబట్టారు. ఇంతకంటే దేశానికి సిగ్గుచేటు లేదన్నారు. సింగపూర్కు వెళ్లి ప్రధానిని నిందించడం అంటే భారతీయులందర్నీ నిందించినట్లే అన్నారు.
విదేశాల్లో ప్రధానిని కించపర్చిన మొదటి వ్యక్తి చంద్రబాబు అన్నారు. భారతీయులంతా నిన్ను సిగ్గుతో తిరస్కరిస్తారని మండిపడ్డారు. మంత్రి గంటా శ్రీనివాస రావు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలియదన్నారు. రాజకీయ కుట్రలకు గంటా మేధావి అన్నారు. తెలుగు జాతి, తెలుగు భాషపై చంద్రబాబు దాడి చేస్తున్నారని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.