బాబు అంటే ఏంటో చెప్పడానికి ఇవి చాలు.. బ్రోకర్: పోసాని సంచలనం, పవన్ను ఇప్పుడు తిట్టడమా
Recommended Video
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏమిటో చెప్పడానికి ఇవి చాలదా.. అంటూ ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి సోమవారం నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా, ఆస్తులు, ఎన్టీఆర్ నుంచి కుర్చీ లాక్కోవడం, బీజేపీ, వామపక్షాలు, పవన్ కళ్యాణ్ను ఉపయోగించుకొని, వదిలేయడం.. ఇలా ఎన్నో అంశాలతో టీడీపీ అధినేతపై విమర్శలు గుప్పించారు.
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా వద్దని గతంలో చంద్రబాబు ఎందుకు అన్నారని, ఇప్పుడు ఎందుకు కావాలంటున్నారో చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం కట్టాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకున్నదని ప్రశ్నించారు. ఇలా చంద్రబాబు ఏమిటో చెప్పడానికి ఎన్నో ఉన్నాయన్నారు.
చంద్రబాబు రాజకీయాల్లో బ్రోకర్ పనులు చేస్తున్నారు
రాజకీయాల్లో చంద్రబాబు బ్రోకర్ పనులు చేస్తున్నారని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మేకవన్నె పులి అన్నారు. జగన్ చాలా స్పష్టంగా మాట్లాడుతారని చెప్పారు. టీడీపీని స్థాపించిన కొత్తలో.. తాను ఎన్టీఆర్ను అయినా ఓడిస్తానని చంద్రబాబు చెప్పారని, ఆ తర్వాత ఓడిపోగానే టీడీపీ పంచన చేరారని మండిపడ్డారు. ఆ తర్వాత ఎన్డీఆర్ జెండాను దొంగిలించారన్నారు. చంద్రబాబు అందరినీ మోసం చేశారన్నారు.
కేసీఆర్ దయ లేకుంటే జైల్లో ఉండేవాడు, ఎవరి కాళ్లు పట్టుకున్నావ్?
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దోరికిపోయాడని పోసాని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మానవత్వం లేకుంటే ఇప్పటికి జైళ్లో ఉండేవాడివని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ఎవరి కాళ్లు పట్టుకున్నావో చెప్పాలని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ కాళ్లు పట్టుకొని చంద్రబాబు విజయవాడకు పారిపోయారన్నారు.
ప్రత్యేక హోదాపై చంద్రబాబు యూటర్న్ తీసుకొని ఇప్పుడు మోడీపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాజకీయంగా ఎవరు తనతో వచ్చినా చంద్రబాబు వారిని నాశనం చేస్తారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీలో చంద్రబాబుకు ఏం మార్పు కనిపించిందో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా వద్దని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మోడీని దుర్మార్గుడు అనడం ఏమిటన్నారు.
పవన్ కళ్యాణ్తో నాడు కలిసి, నేడు తిడుతున్నారు
2014 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి గెలిచారని, ఇప్పుడు ఆయనను తిడుతున్నారని పోసాని ధ్వజమెత్తారు. మోడీ, పవన్, వామపక్షాలు, వాజపేయి.. ఇలా ఎవరితోనైనా కలిసి వారిని విలువలు లేవని తిట్టడం చంద్రబాబుకు అలవాటు అన్నారు. జగన్కు ఓటు వేయమని చెబుతానని అన్నారు. ఆయన అవినీతిని కోర్టులు చెబితే ఆయనకు ఓటు వేయనని చెప్పారు. అసలు జగన్ అవినీతిపరుడు అయితే, 15సార్లు స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు ఏం కావాలన్నారు. నేను వైసీపీని సపోర్ట్ చేస్తున్నానని చెప్పారు. తాను స్పష్టమైన విజన్తో మాట్లాడుతున్నానని చెప్పారు.
కమ్మ - కాపు మధ్య గొడవ పెట్టలేదా?
చంద్రబాబు కమ్మ, కాపుల మధ్య గొడవ పెట్టలేదా అని పోసాని ప్రశ్నించారు. త్వవరలో ఎన్నికలు రాబోతున్నాయని, కాబట్టి ప్రజలు మంచి నేతను ఎన్నుకోవాలని సూచించారు. పోసాని ఓ వర్గం మీడియాపై (టీడీపీ అనుకూల మీడియా) తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఒక వర్గం మీడియా కులం జబ్బు నుంచి బయటకు రావాలని సూచించారు. మీడియానే ఇలా ఉంటే ప్రజాస్వామ్యం చనిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను నందమూరి కుటుంబం ఖండించాలన్నారు. సినిమా పరిశ్రమ దయవల్ల తాను బాగా స్థిరపడ్డానని, ముగ్గురు తెలంగాణ బిడ్డలకు ఆర్థిక సాయం చేశానని చెప్పారు.
లక్ష్మీపార్వతి ఆస్తులు, బాబు ఆస్తులు పక్కన పెట్టి చూద్దాం
విలేకరుల ఓ ప్రశ్నకు సమాధానంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. వైసీపీ నేత లక్ష్మీపార్వతి ఆస్తులను, చంద్రబాబు ఆస్తులను పక్కన పక్కన పెట్టి చూద్దామా అని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు తీసుకొని ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు అంటేనే ఉపయోగించుకొని వదిలివేసే వారని ఆరోపించారు.