రాష్ట్రంలో రౌడీరాజ్యం.. చంద్రబాబు శాడిస్టు.. నయా ఫ్యాక్షనిస్టు : ధ్వజమెత్తిన రఘువీరారెడ్డి
రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తోందని, రౌడీయిజం చేయడంలో టీడీపీ నాయకులు ఆరితేరారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నయా ఫ్యాక్షనిస్టుగా మారారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు.
మడకశిర: రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తోందని, రౌడీయిజం చేయడంలో టీడీపీ నాయకులు ఆరితేరారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నయా ఫ్యాక్షనిస్టుగా మారారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు.
మంగళవారం అనంతపురం జిల్లా మడకశిరలో రఘువీరా మీడియాతో మాట్లాడారు. అధికారులపై దాడి చేస్తున్న టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోకుండా రాజీలు చేయడమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని గ్రహమని, ఇంత శాడిస్ట్ ముఖ్యమంత్రిని తానెప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.
సాగునీటి పథకాల పేరుతో అధికార పార్టీ నాయకులు వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని రఘువీరారెడ్డి ఆరోపించారు. అధికారం పోయిన తర్వాత వారంతా జైలులో ఉండక తప్పదని హెచ్చరించారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు ప్రజాసంక్షేమాన్ని విస్మరించాయని మండిపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నందున.. మూగజీవాలను కాపాడుకునేందుకు వెంటనే గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
లేకుంటే తహసీల్దార్ కార్యాలయాల ఎదుట మూగజీవాలతో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టుల దాడిలో 25 మంది జవాన్లు చనిపోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రఘువీరారెడ్డి కోరారు.