ఏపీ పరిస్థితికి చంద్రబాబే కారణం, అందుకే ఇన్నాళ్లు మాట్లాడలేదు: ఎందుకో చెప్పిన మోడీ
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే తాము రూ.3 లక్షల కోట్ల కంటే ఎక్కువ ప్రాజెక్టులు ఇచ్చామని, ప్రత్యేక హోదా ఇవ్వనప్పటికీ దానికి మించి ప్యాకేజీ ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఈ విషయమై అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు చెప్పిందని గుర్తు చేశారు. ఏపీ ప్రజలకు తాము న్యాయం చేశామన్నారు.
ఏపీకి తక్కువ జరిగిందని భావిస్తే చంద్రబాబే కారణం
ఏపీకి అన్యాయం జరిగిందని ఎవరైనా భావిస్తే, అది తమ తప్పు కాదని, ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానిది అని చెప్పారు. గత 55 నెలల్లో ఏపీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పారు. అందుకే నాలుగేళ్ల పాటు తమను పొగిడారని గుర్తు చేశారు. కానీ ఏదైనా తక్కువ జరిగింది అని ఏపీ ప్రజలు భావిస్తే దానికి టీడీపీ, చంద్రబాబులే అన్నారు.
హోదా కంటే ఎక్కువ ప్యాకేజీ ఇచ్చాం
నాడు కాంగ్రెస్ పార్టీ కేవలం స్వలాభం కోసం విభజన చేసిందని ప్రధాని మోడీ అన్నారు. కానీ ఏపీ, తెలంగాణ ప్రజల బాగు ఆలోచించి కాదన్నారు. అలాంటి వారితో ఇప్పుడు చంద్రబాబు దోస్తీ కట్టారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ద్వారా ఏపీకి ఎన్ని నిధులు రావాలో.. అంతకంటే ఎక్కువ ప్యాకేజీ ఇచ్చామని చెప్పారు. అసెంబ్లీలోనే కేంద్రానికి థ్యాంక్స్ చెప్పారన్నారు. తాము ఇచ్చి ఏపీ ప్రజల పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని చెప్పారు. కానీ ఆయనకు చేతకాక నిరూపించుకోలేకపోయారన్నారు. నిధులకు లెక్క చెప్పమంటే చెప్పకుండా తప్పించుకున్నారని, ఏం తప్పు చేశారని లెక్క చెప్పడం లేదన్నారు.
ఇదే నా హామీ.. ఇది ఏపీ సంస్కృతి కాదు
ఏపీ విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని హామీ ఇస్తున్నానని, తాను బాధ్యత వహిస్తానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఏపీకి పూర్తిగా న్యాయం చేసేలా తాము ఇలాగే పని చేస్తుంటామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ వాసులు సంస్కారవంతులు అని దేశానికి తెలుసు అని చెప్పారు. కానీ కొద్ది నెలలుగా చంద్రబాబు డిక్షనరీలోని తిట్లు అన్న తనకోసమే (మోడీ) దాచినట్లుగా ప్రవర్తిస్తున్నారని, మీరు ఢిల్లీలో ఏపీ సంస్కృతిని తక్కువ చేయకండని సూచించారు. బాబు తీరు చూస్తే ఆంధ్రుల సంస్కృతిని కించపరిచడానికి అన్నట్లుగా ఉందన్నారు.
నేను ఇన్నాళ్లు అందుకే మాట్లాడలేదు
చంద్రబాబు ఎన్ని తిట్టినా తాను ఇన్నాళ్ల పాటు పెదవి విప్పలేదని మోడీ అన్నారు. మీ తండ్రీ కొడుకుల విన్యాసం అందరూ చూస్తున్నారని చెప్పారు. కానీ ఏపీ ప్రజల ప్రేమ, అభిమానం తనకు ఉందని చెప్పారు. నా ప్రసంగం వినేందుకు వచ్చిన అశేష జనం మీ తప్పుడు మాటలను పూర్తిగా విస్మరిస్తున్నారని చెప్పారు. ఏపీలో అవినీతి సర్కార్ పోవాలని మోడీ పిలుపునిచ్చారు. తండ్రీ కొడుకుల అవినీతి త్వరలో పోతుందని చెప్పారు. వీరు ప్రజల అభిమానాన్ని గెలుచుకునే ఆస్కారం లేదన్నారు.
ఓడిపోతామనే భయం
చంద్రబాబుకు ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుందని మోడీ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం, తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిశారని మండిపడ్డారు. ఇచ్చిన నిధులకు లెక్క చెప్పలేదని, ఏదో జరిగిందని అభిప్రాయపడ్డారు. కానీ దానిని ఈ వాచ్మెన్ (మోడీ) దానిని జరగనీయలేదన్నారు. అందుకే కాంగ్రెస్తో దోస్తీ అన్నారు. లెక్కలు చెప్పమని అడిగినందుకు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కేంద్రం నుంచి వచ్చిన ప్రతి రూపాయికి లెక్క చెప్పమని అడిగానని అన్నారు. అది పన్ను కట్టేవారి డబ్బు అన్నారు. అప్పుడే అదే ఆయనకు నచ్చలేదని చెప్పారు. అతనికి లెక్కలు చెప్పే అలవాటు లేదన్నారు. టీడీపీ నేతలు అనేక కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారని చెప్పారు. కేంద్రం అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు స్టిక్కర్లు వేస్తున్నారన్నారు.