బాబుగారూ! నిజమే, మీరు నా కంటే సీనియర్.. ఇదీ నిజస్వరూపం: దుమ్ముదులిపిన మోడీ
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రధాని నరేంద్ర మోడీ గుంటూరు సభలో దుమ్మెత్తిపోశారు. తాను మోడీ కంటే సీనియర్ను అని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. దీనిపై గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశ అభివృద్ధిని దెబ్బతీసిన వారే అవాస్తవాలు ప్రచారాలు చేస్తున్నారని, చంద్రబాబు కూడా ఏపీ వికాసాన్ని మరిచి మోడీ వ్యతిరేక ప్రచారంలో భాగస్వామి అయ్యారన్నారు.
నరేంద్ర మోడీ గుంటూరు సభ చంద్రబాబుకు వణుకు పుట్టిస్తోందా?
చంద్రబాబుతో పోటీ పడలేను
సన్రైజ్ రాష్ట్రం చేస్తానని చెప్పి, కుమారుడి అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మోడీ విమర్శలు గుప్పించారు. తన కంటే సీనియర్ అని చంద్రబాబు అంటారని, కానీ ఆయనకంటూ చెప్పుకునేందుకు ఏమీ లేదన్నారు. సీనియర్ నాయకుడైనందుకు మీకు ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడూ ఇచ్చానని చెప్పారు. కొత్త కూటములు జత కట్టడంలో చంద్రబాబు సీనియర్ అని, ఏపీ ప్రజల కలలను నీరుగార్చడంలో చంద్రబాబు సీనియర్ అన్నారు. ఎన్నికల్లో ఓడిపోవడంలో సీనియర్ అన్నారు. ఆ విషయంలో నేను పోటీ పడలేనని చెప్పారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తే మాత్రం మీతో ఏకీభవించనని అన్నారు.
చంద్రబాబు వీటిల్లో సీనియర్
పదేపదే తనకంటే సీనియర్ అని చెబుతుంటారని, కానీ ఆయన తన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి, అందులో సీనియర్గా నిలిచారని మోడీ ధ్వజమెత్తారు. అంతేకాదు, పార్టీలు మారడంలో కూడా సీనియర్ అన్నారు. పొత్తులు మార్చడంలో సీనియర్ అన్నారు. అసలు తనకంటే చంద్రబాబు ఎందులో సీనియర్, ఇలాంటి వాటిల్లో సీనియర్ అన్నారు. పార్టీ ఫిరాయింపులు, కొత్త కొత్త కూటములు జతకట్టడంలో, మామకు వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు సీనియర్ అన్నారు. కానీ నేను నీలా అలాంటి వాటిల్లో సీనియర్ను కాదని చెప్పారు. ఈ రోజు ఎవరిని తిడతారో.. ఆ తర్వాత వారి ఒళ్లోనే కూర్చుంటారని, అందులో చంద్రబాబు సీనియర్ అని, ఏపీ ప్రజల కలలను నీరుగార్చడంలో మీరు సీనియర్ అని దుయ్యబట్టారు.
చంద్రబాబు నిజస్వరూపం బయటపెట్టేందుకు వచ్చా
రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు జట్టు కట్టారని, ఎన్టీఆర్ కాంగ్రెస్ విముక్త రాష్ట్రం చేయాలని సంకల్పించారని, వారితోనే మీరు జట్టు కట్టారన్నారు. ఇది చూస్తుంటే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంటుందని చెప్పారు. చంద్రబాబు నిజ స్వరూపాన్ని బయట పెట్టేందుకే ఇక్కడికి వచ్చానని, ఎన్నికల్లో ఓడిపోతామని చంద్రబాబు భయపడుతున్నారని, తన కుమారుడిని రాజకీయాల్లో అందలం ఎక్కించాలని చూస్తున్నారన్నారు. సీనియర్గా చంద్రబాబును అంగీకరిస్తానని, ప్రజలను వంచిస్తానంటే మాత్రం ఊరుకునేది లేదన్నారు.
ఏపీ ప్రజల కలలు చీకట్లుగా చేయడంలో బాబు సీనియర్
నాడు ఎన్టీఆర్ ఆశయసాధనతో ముందుకు సాగుతానని, ఎన్టీఆర్ అడుగు జాడల్లో నడుస్తానని చెప్పి, కాంగ్రెస్ పార్టీతో కలిశారని మోడీ నిప్పులు చెరిగారు. నేనే అందరికంటే సీనియర్ అని అందరికీ చెప్పుకుంటున్నారని, కానీ ఏ కుటుంబం, ఏ పార్టీ అయితే ఏపీకి అన్యాయం చేసిందో వారి ఓళ్లో కూర్చున్నారన్నారు. వారి ఓళ్లో కూర్చోవడానికి మీకు ఉన్న ఒత్తిడి ఏమిటి అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ విముక్త రాష్ట్రం కోసం పని చేశారని తెలిపారు. ఎన్టీఆర్ను కాంగ్రెస్ అవమానించిన తీరు అందరికీ తెలుసునని చెప్పారు. చంద్రబాబు అలాంటి పార్టీతో ఎందుకు జతకట్టారన్నారు. దానికి మీపై ఉన్న ఒత్తిడి ఏమిటన్నారు. ఆంధ్ర ప్రజల కలలు చీకట్లుగా చేయడంలో బాబు సీనియర్ అన్నారు.