అంతా బాబు వల్లే.., అలా దొరికిపోయినప్పుడే కేంద్రానికి చిక్కాడు: వైవీ సుబ్బారెడ్డి
విజయవాడ: రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలే ప్రధానంగా వ్యవహరిస్తున్న టీడీపీ, వైసీపీలు.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మానట్లేదు. మీవల్లే రాష్ట్రం నష్టపోయిందని వైసీపీ ఆరోపిస్తే.. అవినీతి దొంగలు, గుంట నక్కలు అంటూ టీడీపీ ఆరోపిస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డిలు టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు వైఖరిని ఈ ఇద్దరూ తీవ్రంగా దుయ్యబట్టారు.
Recommended Video
అంతా బాబు వల్లే: వైవీ సుబ్బారెడ్డి
కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నామన్న వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ బాగా నటిస్తుందన్నారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. ఈనాడు రాష్ట్రం ఇలాంటి దుస్థితిలో ఉందంటే.. కాంగ్రెస్ తర్వాత చంద్రబాబే దానికి బాధ్యుడని అన్నారు.
అలా దొరికిపోయినప్పుడే..
ఓటుకు నోటు కేసులో దొరికిపోయినప్పుడే చంద్రబాబు కేంద్రం చేతిలో పావుగా మారిపోయాడని ఆరోపించారు. అప్పటినుంచి రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతున్నా.. చంద్రబాబు మాత్రం నోరు మెదపడం లేదని మండిపడ్డారు.
కేంద్రం నుంచి తప్పుకోండి..:
కేంద్ర కేబినెట్లో మంత్రులుగా ఉన్నవాళ్లే ప్లకార్డులు పట్టుకుని ఎలా ఆందోళన చేస్తారని వైవీ నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల టీడీపీకే గనుక చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టి టీడీపీ ద్వంద్వ పోకడలు పోతోందని ఆయన దుయ్యబట్టారు.
అంతా పొలిటికల్ స్టంట్: మేకపాటి
పార్లమెంట్ ఉభయ సభల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేస్తున్నదంతా పొలిటికల్ స్టంట్ అని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ నిజంగానే కేంద్రంతో టీడీపీ తెగదెంపులు చేసుకున్నా.. ఆ పార్టీని జనం పరిస్థితులో లేరన్నారు. ఇదంతా ఎన్నికల ముందు జరుగుతున్న రాజకీయ ఎత్తుగడ లాగే ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.