నాకు ఈ పదవి అవసరం లేదని మోడీకి చెప్పా: జగన్ ఇలాకాలో చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపాలని, లేదంటే తనకు ఈ పదవి (ముఖ్యమంత్రి) అవసరం లేదని తాను ప్రధాని మోడీకి తేల్చి చెప్పానని సీఎం చంద్రబాబు అన్నారు.
కడప: పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపాలని, లేదంటే తనకు ఈ పదవి (ముఖ్యమంత్రి) అవసరం లేదని తాను ప్రధాని నరేంద్ర మోడీకి తేల్చి చెప్పానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు.
జగన్ ఇలాకాలో నీటిని విడుదల చేసిన బాబు, నాటకాలని ఆగ్రహం
పైడిపాళెం ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రారంభించి పులివెందుల బ్రాంచి కెనాల్కు నీటిని విడుదల చేశారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
2014 ఎన్నికల్లో గెలిచిన అనంతరం పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణ రాష్ట్రంలోని ఏడు మండలాలను కలపాలని తాను గట్టిగా చెప్పడంతో మోడీ ప్రభుత్వం తమ తొలి సమావేశంలోనే ఆ పని చేసిందని చెప్పారు.
నేను మొదలు పెట్టిన ప్రాజెక్టునే నేనే పూర్తి చేశానని, ఇది సంతోషకరమన్నారు. దీని ద్వారా ఇక్కడ 67 వేల ఎకరాలకు నీరు వస్తుందన్నారు.
ఈ రోజును తన జీవితంలో మరిచిపోలేనని చెప్పారు. తన అనుభవం అంత వయస్సు లేని వారు నన్ను చెప్పుతో కొట్టాలని, బంగాళాఖాతంలో పడేయాలని అంటున్నారని జగన్ పైన మండిపడ్డారు. నా జీవితంలో ఈ రోజును మరిచిపోలేనని చెప్పారు.
బస్సులో పరిపాలన చేశా
విభజన చట్టంలో పదేళ్ల పాటు హైదరాబాదులో ఉండి పాలించవచ్చునని ఉందన్నారు. కానీ తాను హైదరాబాదులో ఉంటే ఏపీ వెనుకబడుతుందని గుర్తించి, తాను ఇక్కడి నుంచే పరిపాలన ప్రారంభించానన్నారు. కొన్నాళ్లు బస్సులో ఉండి పరిపాలన చేశానన్నారు.
రాయలసీమను తప్పకుండా రతనాల సీమను చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. తాను పన్నెండు నెలల్లో పట్టిసీమను పూర్తి చేశానని, ఇది ఓ చరిత్ర అన్నారు.