హిట్ కాంబినేషన్!: ఆశ్చర్యపర్చిన బాబు, నిద్రలో ప్రసాద్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కమ్మ, కాపు వర్గాలకు సామాన ప్రాధాన్యత ఇస్తూ పార్టీ నేతలనే ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారట! టిడిపి అధికారంలోకి రావడానికి ఈసారి ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం కూడా సైకిల్ వైపు మొగ్గడమే కారణమని చెబుతున్నారు.
గత కొన్నేళ్లుగా కాపు సామాజిక వర్గం టిడిపికి దూరంగా ఉంటోంది. అయితే, విభజన తదితర కారణాల వల్ల ఆ సామాజిక వర్గం ఇప్పుడు టిడిపి వైపు మొగ్గు చూపింది. కాపు సామాజిక వర్గానికే చెందిన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా టిడిపికి ప్రచారం చేయడం కలిసి వచ్చింది. మొత్తంగా కాపులు ఈ ఎన్నికల్లో టిడిపి వైపు మొగ్గు చూపినట్లుగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవద్దనే ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం రాజకీయాలను శాసించే స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ వర్గానికి కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వాలని బాబు భావిస్తున్నారట.
ఇటీవల మంత్రివర్గాన్ని చూసినా, నిన్నటి సభాపతి, ఉప సభాపతి అంశాలను చూసినా బాబు ఆ వర్గాన్ని దూరం చేసుకోకూడదనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. తన మంత్రివర్గంలో చంద్రబాబు కాపు, కమ్మలకు సమాన ప్రాధాన్యత ఇచ్చారు.
కాపులు అధికంగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల నుండి అదే సామాజిక వర్గానికి చెందిన చిన రాజప్పకు డిప్యూటీ సీఎం చేశారు. బాబు కేబినెట్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన దేవినేని ఉమామహేశ్వర రావు, పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాసులు ఉండగా.. కాపు సామాజిక వర్గానికి చెందిన చిన రాజప్ప, గంటా శ్రీనివాస రావు, మాణిక్యాల రావు, కిమిడి కృపారాణి, పి నారాయణలు ఉన్నారు.
సభాపతి, ఉప సభాపతి ఎంపికలోను బాబు అదే సమతౌల్యాన్ని పాటించారంటున్నారు. సభాపతిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన కోడెల శివప్రసాద్ను ఏకగ్రీవం చేశారు. అదే విధంగా ఉపసభాపతిగా కాపు సామాజిక వర్గానికి చెందిన మండలి బుద్దప్రసాద్ను ఏకగ్రీవం చేశారు. మండలిని ఉపసభాపతిగా చంద్రబాబు హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడంపై పార్టీ సీనియర్లు సైతం విస్మయం చెందారట.
తొలుత ఉప సభాపతిగా గొల్లపల్లి సూర్యారావు పేరు వినిపించింది. అయితే, చంద్రబాబు చివరి నిమిషంలో మండలిని తీసుకు వచ్చారట. చంద్రబాబు నిర్ణయం తీసుకొని ఫోన్ చేసిన సమయంలో మండలి నిద్రలో ఉన్నారట. మండలి నిద్రపోతుండగా.. ఫోన్ చేసి నామినేషన్ వేసేందుకు రావాలని చెప్పారట. అది విని స్వయంగా మండలి కూడా ఆశ్చర్యపోయారట.