రెండు, మూడు సార్లు చక్కర్లు: వైఎస్ ఇడుపులపాయ ఎస్టేట్పై దృష్టి?
కడప: కడప జిల్లా ఇడుపులపాయలోని వైయస్ రాజశేఖ రెడ్డి ఎస్టేట్పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కన్ను పడినట్లు తెలుస్తోంది. ఆ ఎస్టేట్కు సంబంధించిన భూముల వివరాలను ఆయన కలెక్టర్ను అడిగి తెలుసుకున్నట్లు కూడా చెబుతున్నారు. అక్రమ స్వాధీనంలో ఉంటే వాటిని తిరిగి తీసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు.
జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు ట్రిపుల్ ఐటీకి వచ్చారు. హెలికాఫ్టర్ ట్రిపుల్ ఐటీ హెలిప్యాడ్లో దిగడానికి ముందు చంద్రబాబు రెండు, మూడు రౌండ్లు ఇడుపులపాయ చుట్టూ చక్కర్లు కొట్టారని ప్రచారం సాగుతోంది. ఆ వ్యవసాయక్షేత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించారని కూడా అంటున్నారు.వైఎస్ అంత్యక్రియల రోజు ట్రాఫిక్ జామ్ వల్ల చంద్రబాబు ఇడుపులపాయకి రాలేక వెనక్కి వెళ్లిపోయారు. తొలిసారిగా ఇడుపులపాయకు వచ్చిన బాబు వైఎస్ సమాధిని, వారి వ్యవసాయ భూములను పరిశీలించారని కొందరు అనుకుంటున్నారు.
ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలో అసైన్డ్ భూములు ఏమైనా ఉన్నాయా? వైఎస్ కుటుంబం ఆక్రమించుకున్న భూమి ఎంత? ప్రస్తుతం ఇందులో అటవీ భూములు ఏమైనా ఉన్నాయా? అని చంద్రబాబు జిల్లా కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారని పుకార్లు షికార్లు చెస్తున్నాయి.
ఒకవేళ ఈ వ్యవసాయక్షేత్రంలో అలాంటి భూములు ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనీ, అందుకే ముఖ్యమంత్రి ఇడుపులపాయను క్షుణ్ణంగా హెలికాఫ్టర్లో తిరుగుతూ పరిశీలించారని ప్రచారంలో ఉంది. అయితే, అందులో ఏ మేరకు నిజం ఉందనేది మాత్రం తెలియడం లేదు.
శేషాచలం అడవి అంచున ఉన్న ఇడుపులపాయలో వైఎస్ కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రం ఉంది. వైఎస్ తండ్రి రాజారెడ్డి సంపాదనగా దీన్ని చెబుతారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వైయస్ రాజశేఖర రెడ్డిఇడుపులపాయలో ఒక గెస్ట్హౌస్, రెండు ఇళ్లు నిర్మించారు. ఇక్కడికి వచ్చినప్పుడు రాత్రిపూట ఇడుపులపాయ వ్యవసాయక్షేత్రంలోనే నిద్రించేవారు.
ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం సంపాదించిన భూములపై గతంలో అనేక ఆరోపణలొచ్చాయి. ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 11 వందల ఎకరాల భూములు ఉండేవి. వైఎస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఇడుపులపాయ వ్యవసాయక్షేత్రంలో 300ల ఎకరాలను అటవీభూమిగా గుర్తించి ఆ శాఖకే దాన్ని అప్పగించారు. మరో 330 ఎకరాలను ట్రిపుల్ ఐటీకి, 50 ఎకరాలను నెమళ్ల పార్కుకు కేటాయించారు.
మిగిలిన 300 ఎకరాలకు పైగా ఉన్న భూములు మాత్రమే ఇడుపులపాయ క్షేత్రంలో వైఎస్ కుటుంబ ఆధీనంలో ఉన్నాయి. ఇవి వైఎస్ కుటుంబ సభ్యుల పేర్లమీద ఉన్నట్లు సమాచారం. ఇందులోనూ ఏమైనా మతలబు ఉందా అనే కోణంలో చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు వినికిడి.