అమరావతి ముంపుపై బాబు ఫైర్, 'ఏపీలో ముందస్తుపై జగన్కు హాట్లైన్లో బీజేపీ సమాచారం'
అమరావతి: విభజన సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మంగళవారం మాట్లాడారు. తెలంగాణ విషయంలో అన్ని రకాలుగా తాము సర్దుకుపోయేందుకు ప్రయత్నాలు చేశామని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తారా అని బీజేపీపై ధ్వజమెత్తారు.
నాకు బెదిరింపులు వచ్చాయి, చంద్రబాబు నన్ను కాపీ కొట్టారు: కమెడియన్ పృథ్వీ
తెలంగాణలో ఒక్క మాట కూడా చెప్పకుండా తమతో పొత్తు లేదని బీజేపీ ప్రకటన చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమతో పొత్తు లేదని తెలంగాణ బీజేపీ చెప్పినప్పుడే కుట్రలు అర్థమయ్యాయని వ్యాఖ్యానించారు.
రాజధాని కోసం ఎన్నో జాగ్రత్తలు
రాజధాని నిర్మాణంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. రాజధానికి ముంపు వస్తుందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో వర్షం వస్తుందని గొడుగులు, రెయిన్ కోట్లు వేసుకొని వస్తారా అని బీజేపీ ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ నేతలను కృష్ణానదిలో ముంచితో పాపం పోతుంది
బీజేపీ నేతలను కృష్ణానదిలో మూడుసార్లు ముంచితే పాపంపోయి పుణ్యం వస్తుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం విషయంలో కేంద్రం విషం కక్కుతోందన్నారు. కేంద్రానికి మేం గులాంగిరీ చేయాలా అని ప్రశ్నించారు. నవ్యాంధ్ర పైన కేంద్రానికి అంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ఆగదని చంద్రబాబు చెప్పారు.
బీజేపీ నేతలవి మాటలే
బీజేపీ ప్రభుత్వం మాటలే చెబుతోందని, చేతల్లో చూపలేకపోతోందని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మనలను మోసం చేసిందన్నారు. ఏ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వలేదన్నారు. యువనేస్తం కోసం పని చేసిన మంత్రుల సబ్ కమిటీని అభినందిస్తున్నానని చెప్పారు. యువనేస్తం దేశానికే ఆదర్శం కాబోతుందన్నారు. ఈ ఏడాది 1.60 లక్షల ఉధ్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు 58 శాతం పూర్తయిందన్నారు.
ఏపీలో ముందస్తుపై హాట్లైన్లో జగన్కు బీజేపీ సమాచారమిచ్చిందా?
బీజేపీ నేతలకు ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. ఏపీలోను జగన్ ముందస్తు అంటున్నారని, ఏపీలో ముందస్తు ఉంటుందని జగన్కు బీజేపీ హాట్లైన్లో చెప్పిందా అని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. మరోవైపు, శాసన మండలిలలో నిరుద్యోగ భృతిపై చర్చ జరిగింది. బాబు వస్తే జాబు వస్తుందని ఓట్లు వేయించుకున్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. సమ్మిట్ల పేరుతో హడావుడి చేసినా కంపెనీలు రాలేదన్నారు. నాలుగేళ్ల తర్వాత నిరుద్యోగ భృతి గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.