వైయస్ జగన్కు నరేంద్ర మోడీ బెదిరింపులు: మోడీకి చంద్రబాబు షరతు, కేసీఆర్పై తీవ్రవ్యాఖ్య
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కోసిగిలోని జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ, వైసీపీ అధినేత వైయస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు. మోడీకి అధికారం ఇస్తే దేశాన్ని భ్రష్టు పట్టించారన్నారు.
ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్: కాంగ్రెస్ దోస్తీ బాబుకు దెబ్బ, లోకసభ ఎన్నికల్లో జగన్దే హవా!
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించడం లేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలు కలిసి నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వీరంతా కలిసి ఏపీ పై దాడి చేస్తున్నారన్నారు. మన రాష్ట్రాన్ని బలహీనపర్చే కుట్ర చేస్తున్నారన్నారు.
అగ్రవర్ణ రిజర్వేషన్లకు మద్దతుపై మోడీకి చంద్రబాబు కండిషన్
కాపులకు రిజర్వేషన్లు ఇచ్చి తీరాలని చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నారన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తేనే ఈబీసీలకు రిజర్వేషన్లను సమర్థిస్తామని చెప్పారు. అలాగే, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని తాము కేంద్రానికి నివేదిక పంపించామని చెప్పారు. కేంద్రం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదన్నారు. వాల్మీకుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయిస్తామన్నారు.
జగన్కు మోడీ బెదిరింపులు
వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ కోడి కత్త డ్రామా ఆడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఈ కేసును చూపించి సానుభూతి పొందాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. జగన్ పైన ప్రధాని నరేంద్ర మోడీ సీబీఐ కత్తి పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసమే జగన్ బీజేపీతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. అవినీతిపరుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. పవన్కు ఉన్నవి రెండే కత్తులు అని ఒకటి సీబీఐ కత్తి, రెండు కోడి కత్తి అన్నారు. తనపైన ఎవరూ బురదజల్లలేరని, అది ఎవరికీ సాధ్యం కాదన్నారు. అవినీతి చక్రవర్తులకు రాష్ట్రమంతా అవినీతి కనిపిస్తుందన్నారు.
జగన్ వల్ల ఐఏఎస్లు జైలుకెళ్లారు
వైయస్ జగన్ వల్ల ఐఏఎస్లు, పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్లారని చంద్రబాబు అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్ తన పైన విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేతకు హెచ్చరికలు జారీ చేశారు. కేంద్రం చేసిన అవినీతిని జగన్ ఎందుకు నిలదీయడం లేదన్నారు. తమ పాలన పారదర్శకంగా ఉందని చెప్పారు. ఎక్కడా అవినీతి అనే మాటే లేదని చెప్పారు. టెక్నాలజీ సాయంతో అవినీతిని నియంత్రించామని తెలిపారు. కొత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే తెరాస అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అక్కడ నాశనం చేశారని చంద్రబాబు అన్నారు.