అమెరికా కంటే మనమే ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడతాం, బాధ్యత నాదే: చంద్రబాబు
విజయవాడ: ఏపీని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం చెప్పారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జ్ఞానభేరి సభలో ఆయన మాట్లాడారు.
ప్రపంచంలో ఏ దేశానికి లేని యువశక్తి భారత్కు ఉందని చెప్పారు. పిల్లలను బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఉందన్నారు. దేశంలో గుర్తింపు పొందిన ప్రముఖ యూనివర్సిటీలను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
నరేంద్ర మోడీ తన కంటే సీనియర్ ఏమీ కాదని చంద్రబాబు చెప్పారు. మోడీ 2002లో ముఖ్యమంత్రి అయ్యాడని, కాని అంతకుముందే తాను సీఎంను అయ్యానని చెప్పారు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు. హేతుబద్ధత లేని విభజన జరిగిందన్నారు. తాను అప్పుడు భావితరాల కోసమే బీజేపీతో కలిశానని చెప్పారు. విభజన తర్వాత ఆస్తుల పంపకం చేయాలని చట్టంలో పెట్టారన్నారు. బీజేపీ నమ్మక ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి మోడీ నమ్మకద్రోహం చేసి నట్టేట ముంచారన్నారు.
రాష్ట్రంలోని ఐదు నదులను అనుసంధానం చేస్తామని చెప్పారు. 2 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించవచ్చునని చెప్పారు. కేంద్రం సహకరించకపోయినా డబుల్ డిజిట్ గ్రోత్ సాధించామని చెప్పారు. ఎలాంటి ఛార్జీ తీసుకోకుండా సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని చెప్పారు.
అమెరికా కంటే ఎక్కువగా ఆంగ్లం మాట్లాడేది భారతీయులేనని చెప్పారు. జియో ట్యాగింగ్ ద్వారా భూములను డిజిటలైజేషన్ చేస్తున్నామని చెప్పారు. చదువుకున్న యువతను అభివృద్ధిలోకి తెచ్చే బాధ్యత తనది అని చెప్పారు. విద్యార్థులు నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో అనుసంధానం కావాలన్నారు.
తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో 72 శాతం ప్రజల్లో సంతృప్తి ఉందని చెప్పారు. తాము జవాబుదారీ పాలన అందిస్తున్నామని తెలిపారు. వాయిస్ బేస్ సర్వీస్ను త్వరలో తీసుకు వస్తామని చెప్పారు.