కరెంటు ఢిల్లీలో స్విచ్ తెలంగాణలో ఫ్యాన్ ఏపీలో: వైసీపీ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు
తిరుపతి: ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. శంఖం పూరించి క్యాంపెయినింగ్ ప్రారంభించారు చంద్రబాబు. ముందుగా టీడీపీ సంక్షేమ ఫథకాలపై మాట్లాడిన చంద్రబాబు ఆ తర్వాత తన టార్గెట్ను వైసీపీ పై మరల్చారు. శుక్రవారం జరిగిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి చంద్రబాబు తన ప్రసంగంలో ప్రస్తావించారు.
వివేకా హత్య .. జరిగింది వాళ్ళ ఊళ్ళో, వాళ్ళ ఇంట్లో .. టీడీపీకి ఏం సంబంధం ..చంద్రబాబు ఫైర్
సాక్షాలను ఎందుకు మాయం చేశారు..?
వివేకా మృతి చాలా బాధాకరం అన్న చంద్రబాబు...ఆయన మృతి వెనక చాలా అనుమానాలున్నాయన్నారు. సొంతవారే వివేకా హత్యకు గురైన తర్వాత కొన్ని సాక్షాలను డ్యామేజీ చేశారని ధ్వజమెత్తారు. వివేకానందరెడ్డిని ఎవరి చంపారో రాష్ట్రానికి తెలియాల్సి ఉందా లేదా అని ఆయన ప్రశ్నించారు..? చనిపోయిన తర్వాత ఎవరు ముందుగా చూశారు..? సాక్షాలను కనుమరుగయ్యేలా ఎవరు చేశారు....? ఎవరు ముందుగా ఫిర్యాదు చేశారు...? ఈ విషయాలన్నిటిని రాష్ట్ర ప్రజలకు తెలపాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇక సాయంత్రం వివేకా తాను రాసిన లేఖ బయటపెట్టారని ఇదంతా ఒక డ్రామాగా ఉందని చంద్రబాబు అన్నారు. దీన్నే పులివెందుల రాజకీయం అని అంటారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
కేసీఆర్ మహానాయకుడనే ఫీలింగ్లో ఉన్నాడు
ఇక బీహార్ గ్యాంగ్ ఏపీలోకి దిగిందని... దీనికి నాయకత్వం వహిస్తోంది ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఫామ్ 7 ద్వారా డేటాను చోరీ చేసే ప్రయత్నం వైసీపీ వాళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక తెలంగాణలోని ఐటీ గ్రిడ్ సంస్థపై తెలంగాణ పోలీసులు దాడి చేసి తమవారని వేధించి అరెస్టు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. కేసీఆర్కు ఏపీ డేటా పై చాలా ప్రేమ ఉందని చెప్పిన చంద్రబాబు... కేసీఆర్ డేటా చోరీ చేసి జగన్కు ఇస్తున్నారని అన్నారు. కేసీఆర్ తనేదో మహానాయకుడు అని విర్రవీగుతున్నాడని... ఒకప్పుడు ఇదే వేదికపై తనకోసం ఎదురుచూసిన వ్యక్తి కేసీఆర్ అని చంద్రబాబు అన్నారు. ఇక వీరందరికీ కాపలాదారుడు ఢిల్లీలో ఉన్నాడని ఆయనే నరేంద్ర మోడీ అని చంద్రబాబు చెప్పారు.
వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం రావణకాష్ట అవుతుంది
ఢిల్లీలో కరెంట్ ఉంటే స్విచ్ హైదరాబాదులో ఉందని.. ఢిల్లీ కరెంటు వినియోగించుకుని హైదరాబాదులో స్విచ్ వేస్తే ఏపీలో ఫ్యాన్ తిరుగుతుందని ఎద్దేవా చేశారు చంద్రబాబు. వైసీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రావణకాష్టలా మారుతుందని చెప్పారు. 150 సీట్లతో గెలుపు ఎప్పుడో టీడీపీ వశమైందన్న చంద్రబాబు... అభివృద్ధిని చూసి టీడీపీని గెలిపించాలని అన్నారు. టీడీపీ లక్ష్యం 150 ప్లస్ ఉంటుందని జోస్యం చెప్పారు చంద్రబాబు.