మందుబాబులే నయం.. అది చూసి నేనే షాకయ్యా: చంద్రబాబు
ఆధార్ చెల్లింపులతో ఇంత సులభంగా లావాదేవీలు జరపవచ్చని తెలిసి తాను ఆశ్చర్యానికి లోనయ్యాయని చంద్రబాబు తెలిపారు.
విజయవాడ: నోట్ల రద్దు తర్వాతి పరిణమాలను ఎలా ఎదుర్కోవాలో తలపట్టుకున్న వేళ ఆధార్ ఆధారిత చెల్లింపులు తనను ఒకింత షాక్ కు గురిచేశాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆధార్ ఆధారిత చెల్లింపులు దేశ ప్రగతిని మార్చివేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆధార్ చెల్లింపులతో ఇంత సులభంగా లావాదేవీలు జరపవచ్చని తెలిసి తాను ఆశ్చర్యానికి లోనయ్యాయని చంద్రబాబు తెలిపారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో గురువారం నాడు చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ప్రస్తుతం క్రిస్మస్ సందర్బంగా ఏపీలోని చౌక దుకాణాల్లో ఆధార్ ఆధారిత చెల్లింపులు జరుగుతున్న సంగతి తెలిసిందే.
15 నిమిషాల వ్యవధిలో పదిమంది లబ్ధిదారులు ఈ విధానంలో కొనుగోళ్లు జరపవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. ఇదే సమావేశంలో అధికారులను ఉద్దేశిస్తూ..ఎంతమంది ఆధార్ ఆధారిత లావాదేవీలు నిర్వహించారో చేతులెత్తాలని సీఎం కోరారు.
కేవలం 20శాతం మంది అధికారులు మాత్రమే చేతులెత్తడంతో.."మీకంటే మందుబాబులే నయం'' అంటూ చంద్రబాబు సరదా వ్యాఖ్య చేశారు. దీంతో అక్కడున్న అధికారులంతా ఒక్కసారిగా నవ్వారు. నగదు రహిత లావాదేవీలకు మీరే అలవాటు పడకపోతే ఇక జనానికి ఏం చెబుతారని ప్రశ్నించారు.
మందుబాబులకు మందు లేకపోతే మైండ్ పనిచేయదని, అందువల్లే మెదడుకు మేత పెట్టి డిజిటల్ ట్రాన్సాక్షన్ కు వారు అలవాటు పడ్డారని ఈ సందర్బంగా సీఎం పేర్కొన్నారు.