చంద్రబాబు సొంతూర్లో ఏటీఎం..!: నారావారిపల్లెలో నారా రోహిత్ సందడి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామమైన నారావారిపల్లెలో ఆదివారం నాడు ఆంధ్రా బ్యాంకు ఏటీఎంను ప్రారంభిస్తారు.
నారావారిపల్లె: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామమైన నారావారిపల్లెలో ఆదివారం నాడు ఆంధ్రా బ్యాంకు ఏటీఎంను ప్రారంభిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు రోజులుగా ఆయన తన కుటుంబ సభ్యులతో గ్రామంలో ఉన్నారు.
ఆదివారం నాడు ఏటీఎంను ప్రారంభించి నగదురహిత లావాదేవీల పైన గ్రామస్తులకు అవగాహన కల్పించనున్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు. టిటిడి కళ్యాణ్ మండపంలో వినతిపత్రాలు స్వీకరిస్తారు.
కాగా, సీఎం చంద్రబాబు తన స్వగ్రామమైన నారావారిపల్లికి శుక్రవారం చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల పాటు సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. తరలివచ్చిన నారా, నందమూరి కుటుంబీకులు, మనువడు దేవాన్ష్తో నారావారిపల్లి సందడిగా మారింది.
చంద్రబాబు అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక కాన్వాయ్లో సాయంత్రం అయిదున్నర గంటలకు నారావారిపల్లికి చేరుకున్నారు.
చంద్రబాబు పంచెకట్టుతో మనవడు దేవాన్ష్ను ఎత్తుకొని రావడం సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నారా రోహిత్ సందడి
చంద్రబాబు కుటుంబీకులు నారా లోకేష్, నారా రోహిత్ తదితరులు శుక్రవారం ఉదయం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ చంద్రగిరిలోని అంబికా థియేటర్లో గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని చూశారు.
అభిమానుల ఆనందోత్సాహాల నడుమ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. రోహిత్ను చూసేందుకు అభిమానులు థియేటర్ వద్దకు భారీగా తరలివచ్చారు. తమకు ఎన్టీఆర్ తరవాత నటనలో బాలకృష్ణ ఎంతో ఆదర్శమన్నారు.