తుఫానుపై రాజ్నాథ్కు బాబు లేఖ: మోడీ ఆరా తీశారు కానీ.. మంత్రులు, ఎంపీల నిప్పులు
అమరావతి: కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం లేఖ రాశారు. టిట్లీ తుఫాను నష్టాన్ని ఆ లేఖలో వివరించారు. రూ.3,435 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. తక్షణ సాయంగా రూ.1200 కోట్లు ఇవ్వాలని కోరారు. మరోవైపు గన్నవరం విమానాశ్రయంలో టీడీపీ, ఏపీ మంత్రులు, టీడీపీ ఎంపీలు.. రాజ్నాథ్ను కలిశారు.
'కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడిపోయిన చంద్రబాబు, మోడీకి అడ్డులేదు'
విభజన సమస్యలు, ప్రత్యేక హోదా పైన ఆయనకు వినతిపత్రాలు సమర్పించారు. టిట్లీ తుఫాను తీవ్రతను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. తుఫాను సాయం కోసం చంద్రబాబు రాసిన లేఖను ఆయనకు ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడారు.
ప్రధాని మోడీ ఆరా తీశారు కానీ
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన బీజేపీ కార్యాలయం శంకుస్థాపనకే పరిమితమైందని తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ తీవ్రతపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారని కానీ, అంచనా బృందాన్ని మాత్రం పంపించలేదని ఆరోపించారు.
రాజ్నాథ్కు వివరించామని సోమిరెడ్డి
టిట్లీ తుఫాను నష్టాన్ని రాజ్నాథ్కు వివరించామని మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. తక్షణ సాయం కింద రూ.1200 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు.
ప్రత్యేక విమానంలో రావాలా? ఎప్పటిలాగే చెప్పారు
టిట్లీ తుఫాను బాధితులను రాజ్నాథ్ ఎందుకు పరామర్శించలేదని ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. విపత్తు నివారణ బాధ్యతలను చూస్తున్న రాజ్నాథ్ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రజలు బాధలలో ఉన్న సమయంలో పార్టీ ఆఫీస్ కోసం ప్రత్యేక విమానంలో రావాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. విభజన సమస్యల కోసం రాజ్నాథ్కు వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. ఎప్పటిలాగే చేస్తాం.. చూస్తాం అన్నట్లుగా స్పందించారని వాపోయారు.
బీజేపీ నేతలు పోరాడాలి
రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ విషయాల్లో తమకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా కేంద్రం జాప్యం చేస్తోందని ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. నవ్యాంధ్ర ప్రదేశ్కు జరిగిన అన్యాయంపై రాష్ట్ర బీజేపీ నేతలు పోరాడాలని సూచించారు.