పింఛన్ కారణంగానే: షర్మిల ఇష్యూకు లింక్ పెట్టిన చంద్రబాబు, ఏపీలో కేసీఆర్ తరహా స్కీం
అమరావతి: తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ భేటీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పింఛను రెట్టింపు అంశానికి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఫిర్యాదును లింక్ పెడుతూ వ్యాఖ్యలు చేసారని తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కీలక అంశాలపై కూలంకుషంగా చర్చించారని తెలుస్తోంది. ఏయే పథకాలు త్వరలో అమలు చేయబోతున్నాము... ఏఏ అంశాలను టేకప్ చేయబోతున్నామనే అంశాలను పార్టీ నేతలతో తన అభిప్రాయాలను పంచుకున్నారని తెలుస్తోంది.
షర్మిలకు పింఛన్కు లింక్ పెట్టిన చంద్రబాబు!
మనకు ఏమాత్రం సంబంధం లేని షర్మిల వివాదాన్ని మన పైన రుద్దేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మనం పింఛన్లు రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని, ఈ అంశం ప్రజల్లోకి వెళ్లకుండా, దీనిని దారి మళ్లించే ఉద్దేశ్యంతో షర్మిల అంశాన్ని తెరపైకి తెచ్చి కుట్రకు తెరలేపారని ఆరోపించారు.
మమత పిలిస్తే కేసీఆర్ ఎందుకు రాలేదు
అలాగే, ముగ్గురు మోడీల రాజకీయ కుట్రను ప్రజలకు వివరించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ తిరిగిన కేసీఆర్.. మమతా బెనర్జీ పిలిస్తే కోల్కతా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కోల్కతా తరహాలో దేశవ్యాప్తంగా 10 సభలను కూటమి నిర్వహించనుందని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేసుకుందామన్నారు.
పార్టీ సీనియర్లకు చురకలు
పార్టీ సీనియర్లకు చంద్రబాబు చురకలు అంటించారు. పార్టీ కార్యక్రమాల్లో సీనియర్లు పలుచోట్ల చురుగ్గా పాల్గొనడం లేదన్నారు. వారికి సీనియర్లం అనే ఇగో వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేక పదవులు ఉన్నాయనే అహానికి పోతున్నారా అని ప్రశ్నించారు. రైతులకు తెలంగాణ రాష్ట్రంలో చేసింది తక్కువ అని, ప్రచారం మాత్రం ఎక్కువ చేసుకున్నారన్నారు. ఎన్నికల సమయంలో అందరు నిక్కచ్చిగా ఉండాలని చెప్పారు. బంధుత్వాలు, స్నేహాలు పక్కన పెట్టాలన్నారు. లేదంటే ప్రజలు మనలని నమ్మరని చెప్పారు.
ఏపీలో తెలంగాణ వంటి పథకం
డ్వాక్రా మహిళలకు రూ.10వేలు ఇవ్వబోతున్నామనే విషయాన్ని చంద్రబాబు ఈ సమన్వయ కమిటీ భేటీలో నేతలతో చెప్పారు. తెలంగాణలో రైతు బంధు పేరుతో అందచేస్తున్నటువంటి పథకాన్ని రైతు రక్ష పేరుతో ఏపీలో అమలు చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి సలహాలు ఇవ్వాలని పార్టీ నేతలకు సూచించారు. రైతులకు మూడు విడతలుగా రుణమాఫీ చేశామని, మరో రెండు విడతలు ఒకేసారి జమ చేస్తామని చెప్పారని తెలుస్తోంది. కౌలు రైతులకు సహా అందరికీ పెట్టుబడి సాయం చేసేందుకు సలహాలివ్వాలని కోరారు. ఈ నెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. వచ్చే నెల 8వ తేదీ వరకు సమావేశాలు జరిగే అవకాశముందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిధుల జాప్యం పైన ఈ రోజే కేంద్రానికి లేఖ రాశానని చెప్పారు. రాష్ట్రంలో 95 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారని చెప్పారు. జయహో బీసీ, అమరావతి ధర్మపోరాటం మన ముందు ఉన్న లక్ష్యాలని చెప్పారు.