బాబుకు కేబినెట్ తలనొప్పి: సుజయకు ఇస్తే.., సోమిరెడ్డితో 'బీద' సై
అమరావతి: ఏప్రిల్ 2వ తేదీన మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. అయితే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విస్తరణ తలనొప్పులు వచ్చి పడినట్లుగా తెలుస్తోంది. వారికి పదవులు ఇస్తే తమకూ ఇవ్వాలని, తమ వ్యతిరేకులకు ఇవ్వవద్దని పలువురు చంద్రబాబు వద్ద చెబుతున్నారని తెలుస్తోంది.
విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణకు, వైసిపికి మరింత చెక్ చెప్పే ఉద్దేశ్యంలో భాగంగా సుజయ కృష్ణ రంగారావును కేబినెట్లోకి తీసుకోవచ్చునని చెబుతున్నారు. అయితే, ఇది పార్టీలో అంతర్గత రగడకు దారి తీసిందని తెలుస్తోంది.
సుజయకు ఇవ్వవద్దని..
సుజయ కృష్ణ రంగారావు బొబ్బిలి ఎమ్మెల్యే. ఆయనకు మంత్రి పదవి ఇవ్వద్దని ఎమ్మెల్యేలు కొండపల్లి అప్పలనాయుడు, కోళ్ల లలితా కుమారి, మీసాల గీత, ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీశ్, సంధ్యారాణిలు బాహాటంగానే చెబుతున్నారు.
ఎమ్మెల్యేల్లో ఆందోళన
వీరు సీఎం చంద్రబాబును కలిసి తమ అభిప్రాయం చెప్పారు. ఆయనకు పదవి ఇస్తే బీసీలు దూరమవుతారని పరోక్షంగా చెప్పారని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో తాము వద్దని చెబుతున్న సుజయకు.. మంత్రి పదవి వస్తే, తాము టార్గెట్గా మారుతామనే ఆందోళన కూడా వారిలో ఉందని చెబుతున్నారు.
వీరు కూడా ఆశలు పెట్టుకున్నారు
మంత్రి పదవి కోసం కోళ్ల లలిత కుమారి, మీసాల గీతలు కూడా ఆశలు పెట్టుకున్నారు. మంత్రి మృణాళిని తప్పిస్తే వెలమ, మహిళ సామాజిక వర్గ సమీకరణంతో తనకు వస్తుందని కోళ్ల లలిత కుమారి, కాపు సామాజిక వర్గం నుంచి తనకు వస్తుందని మీసాల గీత ఆశించారు.
చెప్పేసిన కళా వెంకట్రావు
కానీ ఇటీవల ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు.. కోళ్ల లలితను కలిసి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకోవద్దని, సుజయ కృష్ణకు ఖరారయిపోయిందని చెప్పారని తెలుస్తోంది. మృణాళిని తప్పిస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
సోమిరెడ్డితో బీద పోటీ!
ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో బీద రవిచంద్ర పేరు కూడా తెరపైకి వస్తోంది. మంత్రి నారాయణ మద్దతుతో.. జిల్లాలో బీసీలకు అవకాశం కల్పించారనే వాదన తెరపైకి తెచ్చారని అంటున్నారు.