ఐటీ దాడి ఎఫెక్ట్: ఐటీ ఆఫీసర్లకు నో సెక్యూరిటీ, సుప్రీం కోర్టుకు.. బాబు సంచలన నిర్ణయాలు!
అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశంలో శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరుగుతున్న ఆదాయ పన్ను శాఖ దాడులపై వాడిగా వేడిగా చర్చ సాగింది. అలాగే, తెలంగాణలో ముందస్తు ఎన్నికలు, కేసీఆర్ వ్యాఖ్యలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ఐటీ దాడులు చేస్తోందని ఆరోపించారు. ఇది రాష్ట్రంపై జరిగిన దాడిగా చూడాలని కేబినెట్ అభిప్రాయపడింది. ఐటీ దాడులపై అమీతుమీకి సిద్ధపడింది. ఐటీ దాడుల వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు మంత్రులు... చంద్రబాబును అడిగారు.
బాబుపై ఏదో కుట్ర ప్రచారం: వాసిరెడ్డి, అజ్ఞాతంలోకి బీద మస్తానరావు? వైసీపీ రెబల్ సంస్థల్లో ఐటీ సోదాలు
అంతటా ఇదే స్కెచ్, ఈ రాజకీయ దాడులకు మద్దతిచ్చేది లేదు
దానికి చంద్రబాబు స్పందించారు. ఎన్నికలకు ముందు అన్ని రాష్ట్రాలలోను ఇదే తరహా స్కెచ్ వేస్తున్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కర్ణాటక ఎన్నికలకు ముందు జరిగిన అంశాన్ని గుర్తు చేశారని తెలుస్తోంది. ఇది ప్రజాస్వామ్యమేనా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ చేసే రాజకీయ దాడులకు మద్దతిచ్చేది లేదని తేల్చి చెప్పారు.
ఐటీ అధికారులకు సెక్యూరిటీ విత్ డ్రా చేసే యోచన
ఒకేసారి ఇలా దాడులు నిర్వహించాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు కేబినెట్ భేటీలో వ్యాఖ్యానించారు. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయని చెప్పారు. ఐటీ అధికారులకు కూడా సెక్యూరిటీ విత్ డ్రా చేసుకునే అంశంపై యోచిస్తున్నట్లుగా చెప్పారు. ఐటీ దాడులకు వచ్చిన వారికి ఇచ్చిన సెక్యూరిటీ విత్ డ్రా చేసుకోవాలని పలువురు మంత్రులు సూచించారని తెలుస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై సుప్రీం కోర్టుకు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు దెబ్బతీస్తున్నారనే అంశంతో సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాలను కూడా పరిశీలించాలని లా సెక్రటరీకి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అన్నింటికి సిద్ధంగా ఉండాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. మూకుమ్మడి దాడులతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
కీలక నిర్ణయాలు
మొత్తంగా ఐటీ దాడుల నేపథ్యంలో కేబినెట్లో కీలక చర్చ జరిగింది. ఒకటి ఐటీ దాడులను రాష్ట్రంపై దాడిగా చూడాలని కేబినెట్ అభిప్రాయపడింది. అలాగే, సుప్రీం కోర్టుకు వెళ్లాలని యోచిస్తున్నారు. మరోవైపు ఐటీ అధికారులకు సెక్యూరిటీ విత్ డ్రా చేసుకునే కీలక నిర్ణయాలు తీసుకునే యోచన చేస్తున్నారు. కేసీఆర్ చేసిన విమర్శలపై ఎలా స్పందించాలనే అంశంపై కూడా చర్చించారు.