అంతర్జాతీయ నగరంగా 'అమరావతి': సిమెంట్ కంపెనీలతో కుదిరిన డీల్
సోమవారం నాడు పలు సిమెంట్ కంపెనీల యాజమాన్యాలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు.
అమరావతి: నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దబోతున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. సోమవారం నాడు పలు సిమెంట్ కంపెనీల యాజమాన్యాలతో ఆయన భేటీ అయ్యారు. ఇండియా సిమెంట్స్కు చెందిన శ్రీనివాసన్ సహా 19 సిమెంట్ కంపెనీల ప్రతినిధులు భేటీలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో చేపట్టబోయే పలు ప్రాజెక్టులు.. వాటికి సంబంధించిన సిమెంటు అవసరాల గురించి చంద్రబాబు వారితో చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రంలో నిర్మించబోయే పోలవరం ప్రాజెక్టుకు దాదాపు ఒక మిలియన్ టన్ను సిమెంట్ అవసరమవుతుందని, పోలవరంతో పాటు భారీ ఎత్తున పలు ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని వారితో పేర్కొన్నారు.
ప్రాజెక్టులతో పాటు గృహనిర్మాణ రంగం, సీసీ రోడ్లు.. వంటి పనుల్లో సిమెంట్ అవసరాలను తీర్చాల్సిన బాధ్యత సిమెంట్ కంపెనీలపై ఉందని తెలిపారు. రాష్ట్రంలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు అనుగుణంగా తక్కువ ధరకు ప్రభుత్వానికి సిమెంట్ సరఫరా చేయాలని ఆయా సిమెంట్ కంపెనీల ప్రతినిధులను కోరారు.
అలాగే ప్రభుత్వానికి సరఫరా చేసే సిమెంట్ బస్తాలు ఎరుపురంగులో ఉండాలని చంద్రబాబు సిమెంట్ కంపెనీలకు సూచించారు. చంద్రబాబు విన్నపంపై సానుకూలంగా స్పందించిన సిమెంట్ కంపెనీలు.. ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. సీసీ రోడ్లు, పేదలకు గృహ నిర్మాణం వంటి పథకాలకు రూ. 230కి బస్తా, ప్రభుత్వం చేపట్టే ఇతర నిర్మాణాల కోసం రూ. 240కి బస్తా ఇచ్చేందుకు నిర్ణయం జరిగిందని వివరించారు.