వాడిగా వేడిగా బ్యాంకర్ల భేటీ: డిపాజిటర్ల డబ్బు వాడకం-ఆన్లైన్ లావాదేవీలపై బాబు సీరియస్!
అమరావతి: శుక్రవారం మరో రూ.500 కోట్లు నేరుగా ప్రింటింగ్ నుంచి వస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం వెల్లడించారు. నోట్ల రద్దు నాటి పరిస్థితులే ప్రస్తుతం నెలకొన్నాయని, ఒకటో తారీఖు వస్తోందంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
చంద్రబాబు భేష్: కాంగ్రెస్ ముఖ్యనేత షిండే ప్రశంసలు, 'వవన్వి నిలకడ లేని రాజకీయాలు'
చంద్రబాబు బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బ్యాంకుల్లో డబ్బులు ఉండటం లేదని, బ్యాంకులు ఇలా వ్యవహరిస్తే సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో నగదు కొరతకు కారణాలు ఏమిటో చెప్పాలని, సమస్యను ఎలా అధిగమించాలో ఆలోచించాలని సూచించారు.
డిపాజిటర్ల డబ్బు వాడుకుంటామన్నారు, అందుకే ఇబ్బంది
డిపాజిట్లు వస్తోన్న నగదు నాలుగో వంతుకు తగ్గిపోయిందని ఈ సందర్భంగా బ్యాంకర్లు వివరించారు. తీసుకున్న నగదు చాలా వరకు ఖర్చు చేయడం లేదన్నారు. నగదును ఇళ్లలోనే ఉంచుకుంటున్నారని తెలిపారు. దీని వల్లే నగదు కొరత ఏర్పడిందని చెప్పారు. బ్యాంకర్లు ఇబ్బందిక వాతావరణం సృష్టించారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఏ బ్యాంకు అయినా ఇబ్బందుల్లో ఉంటే డిపాజిటర్ల డబ్బు వాడుకుంటామనే సంకేతాలు పంపారని, ఈ విధానం వల్లే ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు.
పెద్ద నోట్ల రద్దుతో ఏం కాలేదు
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... నగదు అందుబాటులో లేదని చెప్పారు. ఏటీఎంలు మూతపడ్డాయన్నారు. బ్యాంకుల నుంచి ప్రజలకు నగదు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందన్నారు. నగదు కొరత అంశం రాష్ట్ర ఆర్థిక వృద్ధిపై ప్రభావం పడుతోందన్నారు. నగదు కొరతపై ఇప్పటికే సీఎం పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారన్నారు. నల్లధనాన్ని అరికడతామని కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిందన్నారు. నోట్ల రద్దు అంశం పెద్దగా ప్రభావం చూపలేదన్నారు. నల్లధనం కట్టడి కాకపోగా పలు సమస్యలు వచ్చాయన్నారు. నగదు చలామణి అయితేనే ఆర్థిక కార్యకలాపాలు ఉంటాయన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రభుత్వాలపై పడుతోందన్నారు. బ్యాంకుల్లో నగదు లేమిని నివారించాలన్నారు.
ఇన్ని ఇబ్బందులుంటే లేవంటారా?
ఇన్ని ఇబ్బందులు ఉంటే బ్యాంకర్లు మాత్రం బాగుందని చెబుతున్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత సమస్య ఉంటే బాగుందని ఎలా చెబుతారన్నారు. సమస్య లేకుంటే ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారన్నారు. బ్యాంకుల్లోని నగదు ఏమవుతోందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో బాధ్యతలు ఉన్నాయన్నారు. పింఛన్లు ఇవ్వాలి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ఏటీఎంలలో నగదు రావట్లేదు
ఏటీంలలో నగదు రావడం లేదని కుటుంబ రావు అన్నారు. రూ.2000, రూ.500 నోట్లు ఏవీ రావడం లేదన్నారు. ఏటీఎంలలో రూ.200, రూ.100 నోట్లు అందుబాటులో ఉంచాలన్నారు. నగదుకొరత పెద్దగా లేదని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వంద నోట్లు కూడా ఎక్కడా కనిపించడం లేదన్నారు.
ఆన్లైన్ ఛార్జీలపై చంద్రబాబు
ఆన్లైన్ లావాదేవీలకు ఛార్జీలు సరైన విధానం కాదని చంద్రబాబు అన్నారు. ఆన్ లైన్ లావాదేవీలకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నారని ప్రశ్నించారు. ఆర్థిక అంశాల్లో నిజాయితీగా ఉన్న ప్రజలను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో నగదు కొరత ఇబ్బందులు -పర్యావసనాలపై ఎస్ఎల్బీసీలో తీర్మానం చేయాలన్నారు.