వారికి టిక్కెట్లివ్వను, మోడీయే ఉదాహరణ: సిట్టింగ్లకు బాబు షాక్!, ప్రధానిని ముఖం మీదే కడిగేశా..
అమరావతి: వచ్చే ఎన్నికల్లో గెలిచే వారికే టిక్కెట్లు ఇస్తానని టీడీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. సోమవారం ఆయన ఉండవల్లిలోని ప్రజా దర్బారు హాలులో ఆ జిల్లా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
Recommended Video
మనం పనులు చేస్తేనే సరిపోదని, నిత్యం ప్రజల్లో ఉండటం ముఖ్యమని నేతలకు సూచించారు. పై రెండింట్లో ఏది చేయకపోయినా సరికాదన్నారు. చేసింది ప్రజలకు చెప్పగలిగితేనే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందన్నారు. మీరు నిరంతరం కార్యకర్తలకు, ప్రజలకు దగ్గరగా ఉండాలన్నారు.
కొందరు సిట్టింగులను మార్చాల్సి ఉంటుంది
వచ్చే ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొంతమందిని అయినా మార్చాల్సి ఉంటుందని చంద్రబాబు అన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పరిస్థితిపై తాను పలు సర్వేలు చేయిస్తున్నానని చెప్పారు. అందులో కొందరు ఎమ్మెల్యేల తీరు బాగా లేదన్నారు. ఎమ్మెల్యేల పని తీరు మారాలని, గెలిచే వారికే టిక్కెట్లు ఇస్తానన్నారు. మంత్రి శిద్ధా రాఘవ రావు, బాపట్ల, ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంచార్జులుగా ఉన్న మంత్రులు నారాయణ, పరిటాల సునీతలతో ఆయన తొలుత భేటీ అయ్యారు.
రేపు మిగతా ఎమ్మెల్యేలతో భేటీ
ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితోను విడిగా భేటీ అయ్యారు చంద్రబాబు. జిల్లాకు చెందిన మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరితో బుధవారం వేర్వేరుగా మాట్లాడనున్నారు. వచ్చే ఎన్నికల్లోగా వెలుగొండ ప్రాజెక్టులో ఒక టన్నెల్ పనులు పూర్తి చేస్తామన్నారు. మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ పేరును ప్రస్తావించారు.
స్వాతంత్రం వచ్చాక ఎవరికీ రానంత ఆదరణ 2014లో మోడీకి
పార్టీలు, నాయకులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయకుంటే ఎలాంటి వ్యతిరేకత వస్తుందో వివరించేందుకు గాను చంద్రబాబు.. ప్రధాని మోడీ పేరును, కేంద్రాన్ని ప్రస్తావించారు. స్వాతంత్య్రం వచ్చాక ఎవరికీ రానంత ఆదరణ 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీకి వచ్చిందని, ఆ తర్వాత అంతే వేగంగా వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ఒక నాయకుడు జాగ్రత్తగా లేకపోతే ఇలాంటి పరిస్థితే ఏర్పడుతుందని, ప్రజలు అనునిత్యం గమనిస్తూ ఉంటారన్నారు.
నేను అడిగితే మోడీ వద్ద సమాధానం లేదు
మోడీ చెప్పేవన్నీ నినాదాలేనని, వాటిని ఆచరణలోకి తెచ్చే శ్రద్ధ కనిపించదని చంద్రబాబు అన్నారు. మోడీని మొదటిగా ఛాలెంజ్ చేసింది మనమేనని, చివరిసారి ఆయనను కలసినప్పుడు అన్యాయం చేశారని చెప్పి వచ్చానని, నీతి ఆయోగ్ భేటీలోను ఆయనను ముఖం మీదే అడిగేశానని చెప్పారు. పదకొండు రాష్ట్రాలకు హోదా కొనసాగించిన విషయాన్ని చెప్పానన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కు ఎలా తీసుకుంటారని ప్రశ్నించానని, దానికి వారి వద్ద సమాధానం లేదన్నారు. తప్పు చేస్తున్నామన్న భావన వారిలో ఉండబట్టే ఎవరూ మాట్లాడలేదన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో మనం గట్టిగా అడగడంపై మంచి స్పందన వచ్చిందని, దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, వైసీపీ, బీజేపీలాలూచీ రాజకీయాల్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు.